Good News : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇక ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదోచ్
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో వాట్సప్లో పౌర సేవలు ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో వాట్సప్లో పౌర సేవలు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రారంభంలో కొన్ని సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. వాట్సాప్ ద్వారానే ఆంధ్రప్రదేశ్ లో ఇక సమకూరుతాయి. పౌర సేవలు, ప్రభుత్వ ధృవీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇక లేదని ప్రభుత్వం చెప్పింది. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండానే ప్రజలు నేరుగా వాట్సాప్లో పౌర సేవలు అందుకునే రోజులు వచ్చేశాయని ప్రభుత్వం అంటోంది. వాట్సాప్ కి చెందిన మెటాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది.
మెరుగైన పౌర సేవల కోసం...
మెరుగైన పౌరసేవల కోసం మెటాతో ఏపీ ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 30న ఒప్పందం కుదుర్చుకుంది. వాట్సాప్ బిజినెస్ ద్వారా దాదాపు నూట యాభై రకాల పౌరసేవలు నేరుగా అందుకునే అవకాశం లభిస్తుంది. ఇది ప్రజలకు చాలా వరకూ ఊరట నిచ్చే అంశమే. ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే వెయిట్ చేయడమే కాకుండా లంచాలు కూడా కొన్ని సేవలకు ఇవ్వాల్సి ఉంటుంది. అదే వాట్సాప్ లో అయితే త్వరితగతిన సేవలను అందుకునే అవకాశం ప్రజలకు లభిస్తుంది. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే శ్రమ నుంచి ప్రభుత్వం ప్రజలను తప్పించడానికే ఈ సేవలను నేటి నుంచి ఏపీలో అందుబాటులోకి తేనుంది.
ఈ రకమైన సేవలను...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ ద్వారా దాదాపు 150 రకాల సేవలను అందించడానికి ఈ సౌకర్యాన్ని ప్రవేశపెడుతుంది. కేవలం మొబైల్ ఫోన్ నుంచి తమకు కావాల్సిన సర్టిఫికేట్ ను తెచ్చుకుని దానిని డౌన్ లోడ్ చేసుకునే వీలుంటుంది. మొదటి దశలో వాణిజ్యరంగంలో సమర్థవంతమైన ప్రభుత్వ సర్వీస్ డెలివరీ కోసం రీ ఇంజనీరింగ్ విధానాలను అమలుచేస్తారు. రెండోదశలో ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా సులభతరంగా పౌరసేవలు అందిస్తారు.ఈ ప్రక్రియలో, ఈ క్రింది విధంగా వివిధ రకాలసేవలను అందించడానికి ప్రాథమికంగా నిర్ణయించారు. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం అభ్యర్థనలను క్రమబద్దీకరిస్తారు. జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీ కోసం వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ప్రజలకు లభిస్తుంది.