AP Budget : 2.86 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన బుగ్గన

శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు

Update: 2024-02-07 06:40 GMT

శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 2.86,389 కోట్ల రూపాయలతో బడ్జెట్ ను రూపొందించారు. రెవెన్యూ వ్యయం రెండు లక్షల ముప్ఫయి వేల నూట పది కోట్ల రూపాయలు, మూలధన వ్యయం 30,530 కోట్ల రూపాయలుగా చూపించారు ద్రవ్యలోటును 55,817 కోట్లుగా తెలిపారు. రెవెన్యూ లోటు 24,758 కోట్ల రూపాయలు అని ఆర్థిక మంత్రి చెప్పారు. జీఎస్టీ లో రెవెన్యూ లోటు 1.56 శాతంగా ఉందని, జీఎస్టీలో ద్రవ్యలోటు 3.51 శాతమని ఆయన పేర్కొన్నారు. సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మహిళలు, సంపన్నులు, సంక్షేమ, భూభద్ర, అన్నపూర్ణ ఆంధ్ర అటూ ఏడు అంశాలను తీసుకుని బడ్జెట్ ను రూపొందించామని చెప్పారు.

సంక్షేమ కార్యక్రమాలను...
ప్రతి గడపకూ సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం అందించిందని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1.3 లక్షల మందికి సచివాలయంలో ఉద్యోగాలను కల్పించామని, 2.6 లక్షల మందిని వాలంటీర్లుగా నియమించామని చెప్పారు. ప్రతి జిల్లాలో దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి మహిళలకు రక్షణగా నిలిచామని తెలిపారు. విద్యారంగంలో సంస్కరణలను తీసుకు వచ్చామన్న ఆర్థిక మంత్రి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టామని చెప్పారు. వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్ ను పెట్టామని చెప్పారు. ప్రపంచంలో పోటీని తట్టుకునే విధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
విద్య, వైద్య రంగాల్లో...
3,376 కోట్ల రూపాయల వ్యయంతో జగనన్న విద్యాకానుకను 47 లక్షల మంది విద్యార్థులకు అందచేశామన్నారు. వైద్యరంగంలో కూడా అనేక సంస్కరణలను తీసుకు వచ్చామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచామన్న బుగ్గన, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆసుపత్రుల్లో కూడా చికిత్స చేయించుకునే వీలును కల్పించామని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశ పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తు వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు. కుప్పంతో సహా కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశామని, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ప్రజలకు పాలనను మరింత చేరువను చేశామని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలే తమ ప్రభుత్వానికి స్ఫూర్తి అని ఆయన తెలిపారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా...
అన్ని రంగాలను అభివృద్ధి దిశగా పయనించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా అనేక మంది అబ్దిదారులకు ఆర్థిక సాయం అందించి ఆసరాగా ఈ ప్రభుత్వం నిలిచిందన్నారు. ఆర్థిక వ్యవస్థలో మహిళలను సమాన భాగస్వామ్యులను చేశామని తెలిపారు. విద్య, వైద్య రంగాలలో తమ ప్రభుత్వం కనపర్చిన శ్రద్ధ గతంలో మరే ప్రభుత్వం కనపర్చలేదని తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సంక్షేమ పథకాలను పార్టీ, కుల, మత, ప్రాంతాల తేడా లేకుండా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందరికీ అందేలా చూడగలిగామని చెప్పారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా అనేక ప్రయోజనాలను అందించామని తెలిపారు. ఉచాల దాత్యుల్లు పై 37,374 కోట్ల సబ్సిడీ ఇచ్చామని చెప్పారు.


Tags:    

Similar News