లైంగిక వేధింపులు.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

అనంతపురం జిల్లా చినమత్తూరు మండలం దేమకేతుపల్లి గ్రామసచివాలయంలో సావిత్రి అనే మహిళ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది.

Update: 2022-01-08 07:59 GMT

ఆడపిల్లలకు ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు వంటి సమస్యలు ఎదురైతే మహిళా పోలీసులను ఆశ్రయిస్తారు. అలాంటి మహిళా పోలీసులకే ఇలాంటి వేధింపులు ఎదురైతే ఏం చేస్తారు ? ఎవరికి చెప్పుకోవాలి ? తోటి ఉద్యోగులే లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దుర్ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

అనంతపురం జిల్లా చినమత్తూరు మండలం దేమకేతుపల్లి గ్రామసచివాలయంలో సావిత్రి అనే మహిళ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. ఆమె సహోద్యోగి అయిన ఓ వ్యక్తి సావిత్రిని తరచూ లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. ఆమె ఎంత వారించినా.. మళ్లీ మళ్లీ వేధిస్తూనే ఉండటంతో భరించలేని సావిత్రి.. చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. రెండ్రోజుల క్రితమే లేపాక్షి చెరువులో సావిత్రి మృతదేహం లభ్యమవ్వగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తోటి ఉద్యోగి లైంగిక వేధింపులే తన మృతికి కారణమంటూ సావిత్రి సూసైడ్ నోట్ రాయగా.. పోలీసులు ఆ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



Tags:    

Similar News