వైసీపీ బెదిరింపులు మామూలుగా లేవు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు పెరుగుతున్నాయన్నారు

Update: 2023-02-28 05:47 GMT

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్ష పార్టీల అభ్యర్థులను పోలీసుల చేత బెదిరిస్తున్నారని ఆయన లేఖలో ఆరోపించారు. కొందరు అభ్యర్థులను కిడ్నాప్ చేస్తున్నారని, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం కూడా గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

నామినేషన్లు వేయకుండా...
ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీకి దిగకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని రామకృష్ణ పేర్కొన్నారు. చాలా చోట్ల ఇతర అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులే అభ్యర్థులను బెదిరిస్తుండటంతో భయపడిపోయి నామినేషన్లను వెనక్కు తీసుకుంటున్నారని రామకృష్ణ తన లేఖలో పేర్కొన్నారు. బలవంతంగా నామినేషన్లను విత్ డ్రా చేయిస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రామకృష్ణ ఎన్నికల కమిషన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.


Tags:    

Similar News