ప్రధాని మోదీతో గంటకుపైగా భేటీ
ముఖ్యమంత్రి జగన్ రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రేపు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి జగన్ భేటీ అయ్యారు. దాదాపు 75 నిమిషాలకు పైగానే మోదీతో జగన్ సమావేశం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మోదీ ఎక్కువ సమయాన్ని జగన్ కేటాయించారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కూడా మోదీతో జగన్ చర్చించారు.
రేపు కూడా....
జగన్ ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. తొలుత అపాయింట్ మెంట్ ఖరారు కాకపోయినా చివరి నిమిషంలో కేంద్ర హోంశాఖ అమిత్ షా అపాయింట్ మెంట్ ను ఖరారు చేసింది. ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా జగన్ కలవనున్నారు. రేపు కూడా జగన్ ఢిల్లీలోనే ఉండి మరికొందరు కేంద్ర మంత్రులను కలసి రాష్ట్ర సమస్యలపై చర్చించనున్నారు.