అమరావతిలో నాకు దేవతలు ఎక్కడా కనపడలేదే?
అమరావతి రాజధాని ప్రజల రాజధాని అంటే బాగుంటుందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు
అమరావతి రాజధాని ప్రజల రాజధాని అంటే బాగుంటుందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. చంద్రబాబు తెలుగు మహా సభల్లో అమరావతి దేవతల రాజధాని అని అనడం విడ్డూరంగా ఉందన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్న నాకు ఎక్కడా ఒక దేవత కూడా కనపడలేదని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. ఒక్క దేవత అయినా కనపడితే మాట్లాడదాం అనుకున్నాననని, మనుషులు, వాళ్ళ కష్టాలు కనబడుతున్నాయి తప్ప, ఎక్కడ దేవతలు కనబడడం లేదని చింతామోహన్ సెటైర్ వేశారు.
వెయ్యి ఎకరాలు చాలని...
ఎక్కడైనా రాజధాని నిర్మాణానికి వెయ్యి ఎకరాలు చాలని, అమరావతి రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాలు అవసరంలేదని చింతా మోహన్ అన్నారు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు అమరావతి రాజధానిని కోరుకోవడం లేదన్న ఆయన అర్థరాత్రి, అమిత్ షా కాళ్ళ ముందు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీస్తున్నారన్నారు. వారానికి ఒకసారి ఢిల్లీకి చంద్రబాబు పరుగులు తీస్తున్నారని, అమరావతి మరో కర్నూల్ అవుతుందనే అనుమానం కలుగుతోందని అన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులు కూడా సంతోషంగా లేరని, పవన్ కళ్యాణ్ పైకి సంతోషంగా తిరుగుతున్నాడని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం దుర్మార్గమని చింతా మోహన్ అన్నారు.