చంద్రబాబు సలహా పాటించక నష్టపోయా : డీఎల్ఎఫ్ ఛైర్మన్
చంద్రబాబు సలహా పాటించక నాడు హైదరాబాద్ లో నష్టపోయాయని డీఎల్ఎఫ్ ఛైర్మన్ రాజీవ్ సింగ్ అన్నారు.
ముఫ్ఫయి ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సలహా పాటించక హైదరాబాద్లో ఓ కీలక పెట్టుబడి అవకాశాన్ని, గొప్ప ఆదాయాన్ని కోల్పోయామని ప్రముఖ రియల్ ఎస్టేట్, హౌసింగ్ సంస్థ డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని రాయదుర్గం ప్రాంతంలో భూములపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా చంద్రబాబు సూచించినా... భవిష్యత్ను సరిగ్గా అంచనా వేయలేక పెట్టుబడులు పెట్టలేదని రాజీవ్ సింగ్ అన్నారు. ఢిల్లీలోని రైసినా డైలాగ్ వేదిక వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుతో డీఎల్ఎఫ్ చైర్మన్ రాజీవ్ సింగ్ కొద్దిసేపు భేటీ అయ్యారు. వారి భేటీలో నాటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సీఎం చంద్రబాబు దార్శనికత, సైబరాబాద్ నిర్మాణంతో రాయదుర్గం ప్రాంతం హైదరాబాద్లో ప్రముఖ ఐటీ కేంద్రంగా ఎదిగిందని అన్నారు.
నాడు పెట్టుబడి పెట్టకపోవడంతో...
నాడు భూములపై పెట్టుబడి పెట్టకుండా అవకాశం కోల్పోయానని... ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నిర్మితం అవుతున్న రాజధాని అమరావతిలో ఆ తప్పు పునరావృతం కానివ్వనని అన్నారు. అమరావతిలో పెట్టుబడులకు రాజీవ్ సింగ్ ఆసక్తి వ్యక్తం చేశారు. త్వరలో అమరావతిని సందర్శించి పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తానని ముఖ్యమంత్రికి తెలిపారు. అమరావతితో పాటు విశాఖపట్నం అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని డీఎల్ఎఫ్ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ రెండు నగరాలను అభివృద్ధి చేయటమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ పాలసీలను, పెట్టుబడులకు గల అవకాశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.