Chandrababu : సంక్షోభాలను అవకాశాలుగా మలచుకోవాలి
సంక్షోభాలనూ అవకాశాలుగా మలచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు
సంక్షోభాలనూ అవకాశాలుగా మలచుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్ అని అన్నారు. నూతనంగా ఆలోచించడం వల్లే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయన్న చంద్రబాబు నాయుడు యూఏఈతో భారత్కు మంచి సంబంధాలు ఉన్నాయి.. యూఏఈ జనాభాలో నలభై శాతం మంది భారతీయులే ఉన్నారన్నారు. యూఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండడం సంతోషకరమన్న చంద్రబాబు నాయుడు 1991లో ఆర్థిక సంస్కరణలు, 1995లో టెక్నాలజీ రివల్యూషన్తో పరిస్థితి మారిందన్నారు.
దుబాయ్ ను చూస్తే...
సదస్సుకు పలు దేశాల ప్రతినిధులు రావడం చర్చలకు ప్రాధాన్యత చేకూర్చిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దుబాయ్ ను చూస్తుంటే తనకు ఆసూయ వేస్తుంటుందని, దుబాయ్లో ఎడారి ప్రాంతాలు, బీచ్లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో భారత్కు అపార అవకాశాలు వచ్చాయని, ఉమ్మడి ఏపీలో విజన్ 2020 రూపొందించానని చెప్పారు. విజన్ 2020తో రాష్ట్రాభివృద్ధి మెరుగుపరిచామన్న చంద్రబాబు వికసిత్ భారత్ ద్వారా 2047 ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, రాష్ట్రంలో 2026 జనవరి నాటికి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 575 సేవలు అందిస్తున్నామని, ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండదని, ఆగస్టు 15 నాటికి అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులోకి తీసుకొస్తున్నామని చంద్రబాబు తెలిపారు.