సీఎం జగన్ పర్యటనపై వారిది ముమ్మాటికీ దుష్ప్రచారమే

సీఎం జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే..! అయితే టీడీపీ విమర్శలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు

Update: 2022-05-21 10:02 GMT

సీఎం జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే..! అయితే టీడీపీ విమర్శలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం టీడీపికి, ఎల్లోమీడియాకు ఒక అలవాటుగా మారిందని.. రోజురోజుకూ వారిలో అనాగరికత పెట్రేగిపోతోందని విమర్శించారు. కనీస విలువలను పాటించాలన్న స్పృహకోల్పోయి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని.. వీరినుంచి ముఖ్యమంత్రి కుటుంబానికే కాదు, రాష్ట్రానికీ ముప్పు మరింత పెరిగిందన్నారు. ముఖ్యమంత్రిగారి దావోస్‌ పర్యటనమీద యనమల చేసిన ఆరోపణలు నిస్సిగ్గుగా ఉన్నాయి. వయసు మీద పడుతున్న కొద్దీ.. యనమల కనీస సంస్కారం కూడా లేకుండా రోజురోజుకూడా దిగజారిపోతున్నారన్నారు.

గత ప్రభుత్వంలో సుదీర్ఘకాలం మంత్రులుగా పనిచేసిన వారికి కూడా విమానప్రయాణాల్లో అంతర్జాతీయ నియమాలు, నిబంధనలు తదితర అంశాలమీద అవగాహన లేకపోవడం, దీనిమీద పనిగట్టుకుని ముఖ్యమంత్రి మీద, ఆయన కుటుంబం మీద విషప్రచారం చేయడం యనమల లాంటి వారు, ఎల్లోమీడియా ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం అవుతుందన్నారు. దాపరికంతో, దొంగదారుల్లో అధికారం సాధించడం, ప్రజలన్ని వంచించడం అన్నది టీడీపీ ట్రేడ్‌ మార్క్‌ తప్ప మాది కాదని అన్నారు. ముఖ్యమంత్రిగారి పర్యటన రహస్యమేమీ కాదని.. కుటుంబ సభ్యులతో కలిసి దావోస్‌ చేరుకుంటారన్న దాంట్లో ఎలాంటి రహస్యం లేదు. నిన్న గన్నవరం విమానాశ్రయంలో బయల్దేరిన తర్వాత ముఖ్యమంత్రిగారు ప్రయాణిస్తున్న విమానం ఇంధనం నింపుకోవడం కోసం ఇస్తాంబుల్‌లో ఆగింది. ఎయిర్‌ట్రాఫిక్‌ విపరీతంగా ఉండడం వల్ల అక్కడ ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఆలస్యం జరిగిందన్నారు. దీనివల్ల లండన్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నప్పుడు మరింత ఆలస్యం అయ్యింది. లండన్‌లో కూడా ఎయిర్‌ ట్రాఫిక్‌ విపరీతంగా ఉండడం.. ఈలోగా జురెక్‌లో ల్యాండ్‌ అవడానికి ప్రయాణ షెడ్యూల్‌ సమయం రాత్రి 10 గంటలు దాటిపోయిందని తెలిపారు. మళ్లీ ల్యాండింగ్‌కోసం అధికారులు రిక్వెస్ట్‌పెట్టారు. ఈప్రక్రియలో స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు కూడా స్వయంగా పాల్గొన్నారు. రాత్రి 10 గంటల తర్వాత జురెక్‌లో విమానాలు ల్యాండింగ్‌ను చాలా సంవత్సరాల నుంచి నిషేధించిన విషయాన్ని స్విస్‌ అధికారులు భారత రాయబార కార్యాలయ అధికారులకు నివేదించారు. ఈ విషయాలన్నీకూడా స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు– లండన్‌లోని భారత దౌత్య అధికారులకు సమాచారం అందించారు. వారు నేరుగా ముఖ్యమంత్రితో కూడిన అధికారులతో చర్చించి.. లండన్‌లోనే ముఖ్యమంత్రిగారికి బస ఏర్పాటు చేశారు. తెల్లవారుజామునే జురెక్‌ బయల్దేరేందుకు ముఖ్యమంత్రి బృందం సిద్ధంగా ఉన్నప్పటికీ... పైలట్లు నిన్న అంతా ప్రయాణంలో ఉన్నందున డీజీసీఏ నిబంధనల ప్రకారం పైలెట్లు నిర్ణీత గంటలు విశ్రాంతిని తీసుకోవాల్సి ఉంటుంది. నిజాలు ఇలా ఉంటే.. ముఖ్యమంత్రిమీద అసూయతో, ద్వేషంతో రగిలిపోతున్న టీడీపీ నాయకులు, ఎల్లోమీడియా ప్రతిరోజూ ఆయన మీద బురదజల్లడం, ముఖ్యమంత్రి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం ఒక అలవాటుగా మారిందని బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు గుప్పించారు. దిగజారిపోవడంలో మరో మైలు రాయిని టీడీపీ అందుకుందన్నారు.


Tags:    

Similar News