AP Minister Sandhya Rani: పెను ప్రమాదం నుండి తప్పించుకున్న ఏపీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణికి
AP Minister Sandhya Rani
ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణికి పెను ప్రమాదం తప్పింది. మంత్రి విజయనగరం జిల్లా మెంటాడ మండల పర్యటనకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అరికతోట సమీపంలోని రామభద్రపురం మీదుగా కాన్వాయ్ లో వెళుతుండగా, ఎస్కార్ట్ వాహనం టైర్ ఒకటి అకస్మాత్తుగా పగిలిపోవడంతో కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మినీవ్యాన్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బంది, వ్యాన్లోని ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు.
అదృష్టవశాత్తూ ప్రమాదానికి గురైన వాహనం వెనుక కారులో ప్రయాణిస్తున్న మంత్రి సంధ్యారాణి సురక్షితంగా ఉన్నారు. ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైన సమయంలో మంత్రి వాహనం డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించారని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. మంత్రి క్షేమంగా ఉన్నారని తెలిసి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను తక్షణమే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించేలా మంత్రి సంధ్యా రాణి ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రులు ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారు.