కేటీఆర్ పై సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2025-07-26 12:25 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రిత్విక్ కంపెనీకి 1660 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్కులకు సంబంధించి తనపై ఆరోపణ చేయడం మూర్ఖత్వమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కయి తాను కాంట్రాక్ట్ పొందానని కేటీఆర్ చేసిన ఆరోపణ పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ఇందులో తనకు సంబంధం లేదన్నసీఎం రమేష్ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి చెల్లెమ్మ షర్మిల తో పోరు ఉన్నట్టే తెలంగాణలో కేటీఆర్ కు కూడా చెల్లెలిపోరుతో పూర్తిగా మతిభ్రమించి మాట్లాడుతున్నావని అన్నారు. ప్రభుత్వం ఏదైనా కంపెనీలకు కాంట్రాక్ట్ పనులు ఇచ్చేటప్పుడు ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తారో పది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన నీకు తెలియదా అని కేటీఆర్ ను సీఎం రమేష్ ప్రశ్నించారు. నాలుగు నెలల క్రితం ఢిల్లీలో నా ఇంటికి వచ్చిన నీవు మాట్లాడవో గుర్తుందా అని కేటీఆర్ ను నిలదీశారు. కావాలంటే నువ్వు వచ్చి వెళ్లిన సీసీటీవీ పుటేజి కూడా మీడియాకు పంపిస్తానన్న సీఎం రమేష్ మీ ప్రభుత్వంలో చేసిన అవినీతి బయటకు రాకుండా, కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బిజెపి పార్టీలో మీ పార్టీని కలపడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పావని అవునా? కాదా? అని సీఎం రమేష్ ప్రశ్నించారు.

బీజేపీలో కలుపుతానని...
తాను మా పార్టీ పెద్దలతో చర్చించి మీది అవినీతి పార్టీ అని, తెలంగాణలో మీ పని అయిపోయిందని, కావున మీతో మాకు పని లేదని చెప్పడం వల్లే ఇటువంటి ఆరోపణ చేస్తున్నావని అన్నారు. గతంలో బీఆర్ఎస్ టిడిపి తో పొత్తు పెట్టుకున్నప్పుడు 300 ఓట్ల మెజార్టీతో నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యేగా గెలిచావో నన్ను చెప్పమంటావా? అని నిలదీశారు. తుమ్మల నాగేశ్వరావు లాంటి నాయకుడిని మీ పార్టీ ఎందుకు వదిలేసుకుందని నిన్ను నేను అడిగితే మా పార్టీకి కమ్మ నేతలు అవసరం లేదని. రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత మా పార్టీలో రెడ్డిలు కూడా రేవంత్ వెనకాల వెళ్లిపోయారని, ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డితోనే కలిసి ప్రయాణం చేస్తున్నామని నువ్వు నాతో చెప్పావా లేదా? అని అన్నార. రానున్న రోజుల్లో తెలంగాణలో బిజెపీ, టీడీపీ పొత్తుతో పని చేస్తాయని అప్పుడు టిఆర్ఎస్ కు పుట్టగతులు ఉండవని తెలిసే ఇటువంటి నిరాధార ఆరోపణలు చూస్తున్నావని సీఎం రమేష్ అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణలో సుమారు 7 లక్షల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చారు? అవి ఎవరెవరికి ఇచ్చారు? అందులో తెలంగాణ వాళ్లు ఎంతమంది? ఆంధ్ర వాళ్ళు ఎంతమంది అన్నది తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయన్న సీఎం రమేష్ మీడియా సమక్షంలో బహిరంగంగా చర్చిద్దామని సవాల్ విసిరారు. కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు.


Tags:    

Similar News