Andhra Pradesh : ఈ రోడ్డు బాగుపడిందంటే?
అమరావతి రాజధాని ప్రాంతంలోని మంగళగిరిపై మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక దృష్టి పెట్టారు
అమరావతి రాజధాని ప్రాంతంలోని మంగళగిరిపై మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి చినకాకాని ఎన్నారై ఆసుపత్రి సమీపంలోని రహదారికి మరమ్మతులు పూర్తి చేశారు. ఇటీవల మొంథా తుఫాన్ కారణంగా రహదారి పక్కనే ఉన్న డ్రైనేజి కాలువ పొంగి ప్రవహించడంతో రహదారి గుంతలు మయంగా మారి స్థానిక ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజల సమస్యపై స్పందించిన నారా లోకేశ్ గుంతలమయంగా మారిన రహదారికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించాలని నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
ఐదు లక్షల వ్యయంతో...
ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు సుమారు ఐదు లక్షల రూపాయల వ్యయంతో రహదారికి మరమ్మతులు పూర్తి చేశారు. కార్పోరేషన్ పరిధిలో భూగర్భ డ్రైనేజీ ల నిర్మాణ ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో శాశ్వత రహదారి నిర్మాణాలు చేపట్టే విషయంలో కొంత జాప్యం జరుగుతోందని, వీలైనంత త్వరలోనే భూగర్భ డ్రైనేజీ నిర్మాణాలతో పాటు ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా శాశ్వత రహదారుల నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు.