ల్యాండ్ పూలింగ్ కు ముందుకు రాకపోతే?
రాజధాని అమరావతి గ్రామం వడ్డమాను లో మంత్రి నారాయణ పర్యటించారు
రాజధాని అమరావతి గ్రామం వడ్డమాను లో మంత్రి నారాయణ పర్యటించారు. మంత్రి నారాయణ కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారిని మంత్రి నారాయణ ప్రారంభించారు. రైతుల వినతితో కేవలం వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేయించిన మంత్రి నారాయణ నేడు ఆ గ్రామంలో పర్యటించడంతో గ్రామస్థులు స్వాగతం భారీగా చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధాని ప్రపంచంలో టాప్ 5 లో ఉండేలా నిర్మిస్తున్నామని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలిపారు.
రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు...
గ్రామస్తులు అడిగిన వెంటనే వారం రోజుల్లోనే కొత్త రోడ్డు నిర్మించామన్న మంత్రి నారాయణ 98.7 లక్షలతో 1148 మీటర్ల రోడ్డును యుద్ధప్రాతిపదికన నిర్మించామని చెప్పారు. రాజధానిలోని 29 గ్రామాల్లో జనవరి నుంచి మౌళిక వసతుల పనులు చేపడతామని, అన్ని గ్రామాల్లో రోడ్లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,వరద నీటి కాలువలు,వీధి లైట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఇన్నర్ రింగ్ రోడ్,స్పోర్ట్స్ సిటీ,రైల్వే లైన్,రైల్వే ట్రాక్ కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకుంటామని, ల్యాండ్ పూలింగ్ కు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, ల్యాండ్ పూలింగ్ కు ఎవరైనా ముందుకు రాకుంటే అప్పుడు భూసేకరణ పై నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు.