Amaravathi : అమరావతిలో స్టార్ హోటల్ నిర్మాణానికి అనుమతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో 4 స్టార్ స్థాయి దసపల్లా హోటల్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

Update: 2025-10-17 02:36 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో 4 స్టార్ స్థాయి దసపల్లా హోటల్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ హోటల్‌ను దసపల్లా అమరావతి హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అభివృద్ధి చేయనుంది. ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలతో ఈ ప్రాజెక్టు రాష్ట్ర రాజధాని పర్యాటక రంగానికి పెద్ద ఊతమివ్వనుందని అధికారులు భావిస్తున్నారు. దసపల్లా హోటల్ నిర్మాణం పూర్తి కాగానే, సుమారు 400 మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.

చుట్టుపక్కల వ్యాపారాలు కూడా...
పర్యాటక రంగ అభివృద్ధి మాత్రమే కాకుండా, హోటల్ నిర్మాణం చుట్టుపక్కల వ్యాపారాలకు కూడా ప్రోత్సాహం లభించనుంది. ఇది అమరావతిని అంతర్జాతీయ స్థాయి టూరిజం సెంటర్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనేక ఆర్థిక రాయితీలను ప్రకటించింది. పది సంవత్సరాల పాటు రాష్ట్ర పన్నులు మరియు స్టాంప్ డ్యూటీని పూర్తిగా తిరిగి చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. అలాగే పరిశ్రమల తరహాలో విద్యుత్ చార్జీలు అమలు చేయడంతో పాటు, ఐదేళ్లపాటు విద్యుత్ సుంకాన్ని రీఫండ్ చేయనుంది. ఈ రాయితీలు రాష్ట్రంలో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే దిశగా అడుగులు పడననున్నాయని తెలిపారు.
పర్యాటకరంగం పాలసీ ప్రకారం...
పర్యాటకరంగం పాలసీ 2024–2029 ప్రకారం పలు ప్రోత్సాహకాలు ఇచ్చేలా పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానం ప్రకారం హోటల్ రంగం, రిసార్టులు, మరియు పర్యాటక ప్రాజెక్టులకు పన్ను రాయితీలు, భూమి సబ్సిడీలు అందించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం టూరిజం మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఈ నిర్ణయంతో అమరావతి పర్యాటక కేంద్రంగా మారే అవకాశాలు మరింత పెరిగాయి. మరిన్ని స్టార్ హోటళ్లు అమరావతి ప్రాంతంలో వచ్చే అవకాశముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News