మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకడం లేదు. ఆయన గత రెండు రోజులుగా సీఎం అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయినా సీఎం ఆ అవకాశం శంకర్ నాయక్ కు ఇవ్వడం లేదు. మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనాతో వివాదం పై వివరణ ఇచ్చేందుకు శంకర్ నాయక్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారని తెలిసి అక్కడకు వెళ్లినా అధికారులు నోచెప్పడంతో శంకర్ నాయక్ నిరాశతో వెనుదిరిగారు. ఆయన ఈరోజు సచివాలయానికి వచ్చి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారు. అయితే కడియం శ్రీహరి కూడా ఈ విషయంలో చేతులెత్తేసినట్లు తెలిసింది. మహిళ కలెక్టర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటనపై సీఎం సీరియస్ గా ఉన్నారని, తర్వాత కలవవచ్చని కడియం సూచించడంతో ఆయన వెళ్లిపోయారు.