బాలయ్యకు కొత్త పిఏ ఎవరో తెలుసా?
By - Telugu Post
Update: 2017-02-14 08:00 GMT
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడిగా విమర్శలు ఎదుర్కొన్న శేఖర్ స్థానంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం.. హైదరాబాద్లో పనిచేసే కృష్ణమూర్తిని నియమించినట్లు తెలుస్తోంది. ఆయన కడప జిల్లా కమలాపురం ప్రాంతానికి చెందిన వారు. కడప జిల్లాలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేసి గుర్తింపు పొందారు. ఆ తర్వాత పార్టీ జిల్లా కార్యదర్శిగాను, కార్యాల య కార్యదర్శిగాను చాలాకాలం పనిచేశారు. మాజీ మంత్రి రామచంద్రయ్య టీడీపీలో ఉన్నప్పుడు కృష్ణమూర్తి కడప జిల్లా పార్టీలో చురుగ్గా వ్యవహరించేవారు. దీంతో ఆయనను హైదరాబాద్ టీడీపీ ప్రధాన కార్యాలయానికి పిలిపించుకున్నారు.
కృష్ణమూర్తి ప్రస్తుతం కార్యక్రమాల కమిటీ ఇన్చార్జిగా, ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యుడిగా పనిచేస్తున్నారు. మొదటి నుంచి బాలకృష్ణ అభిమానిగా ఉంటూ ఆయనతో సన్నిహితంగా ఉంటున్నారు. కృష్ణమూర్తి పెద్దకుమార్తె వివాహానికి దశాబ్దకాలం కిందటే బాలకృష్ణ కడప జిల్లాకు వచ్చారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణకు నమ్మిన బంటుగా ఉన్న కృష్ణమూర్తిని ఆయన వ్యక్తిగత సహాయకుడిగా నియమించి హిందూపురానికి పంపిస్తున్నారు. బాధ్యతలు స్వీకరించే నిమిత్తం ఆయన బుధవారం హిందూపురానికి చేరుకుంటారు. గతంలో ఉన్న పీఏ శేఖర్ పై అవినీతి ఆరోపణలు రావడం, స్థానికంగా ఉండే టీడీపీ నేతలే ఆందోళనకు దిగడంతో శేఖర్ ను పీఏ బాధ్యతల నుంచి బాలకృష్ణ తప్పించారు. ఇప్పడు కొత్త నియామకం జరిగింది.