ప్రయారిటీ మారింది... ఫ్రస్టేషన్ మొదలయింది

కేసీఆర్ కు మరో సవాల్ ఎదురవుతుంది. మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ గెలచి తీరాల్సిన పరిస్థితి.

Update: 2022-08-04 03:27 GMT

కేసీఆర్ కు మరో సవాల్ ఎదురవుతుంది. మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ గెలచి తీరాల్సిన పరిస్థితి. మరికొద్ది రోజలలోనే ఎన్నికలు జరుగుతున్న సమయంలో మునుగోడు గెలిచి తీరాల్సిన పరిస్థితి. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ను పెట్టి మోదీని చీల్చి చెండాడుతున్న కేసీఆర్ సొంత రాష్ట్రంలో జరిగే ఉప ఎన్నికలో ఓటమి పాలు కాకూడదు. ఆ ప్రభావం రేపు ఆయన జాతీయ పార్టీపై కూడా ప్రభావం పడే అవకాశముంది. అందుకే నల్లగొండ జిల్లాలో ఉన్న మునుగోడు ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా మారిందనే చెప్పాలి. అనుకోకుండా వచ్చిన ఉప ఎన్నికను డీల్ చేయడంలో కేసీఆర్ సక్సెస్ అవుతారా? ఫెయిల్ అవుతారా? అన్నది ఆసక్తికరమే.

ఉప ఎన్నిక...
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడం ఖాయమైపోయింది. ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అదే జరిగితే టీఆర్ఎస్ కు గెలవడం అత్యంత అవసరం. వచ్చే ఎన్నికలకు ఈ ఉప ఎన్నిక ఫలితం రెఫరెండమని విపక్ష నేతలు ఖచ్చితంగా సవాల్ చేస్తారు. ఒకరకంగా నిజమే. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని నిరూపించుకోవాలంటే ఈ మునుగోడు ఉప ఎన్నికలో ఖచ్చితంగా గులాబీ పార్టీ జెండాను ఎగరేయాల్సి ఉంటుంది.
నిధులతోనే....
కానీ బలమైన అభ్యర్థి ఎదుట ఉన్నారు. అతనిని ఎదుర్కొనాలంటే కేవలం నిధులు వెదజల్లితే కుదరదు. హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఇప్పటికే టీఆర్ఎస్ కు గుణపాఠం నేర్పింది. అత్యంత ఖరీదైన ఎన్నిక జరిగిన హుజూరాబాద్ లోనూ టీఆర్ఎస్ గెలవలేదు. ఎంతోమందికి పదవులు ఇచ్చినా ఫలించలేదు. ఈసారి మునుగోడు విషయంలో కేసీఆర్ ఆ ప్రయోగం చేయకపోవచ్చంటున్నారు. నియోజకవర్గం సమస్యల వరకూ ఓకే కాని, విచ్చలవిడిగా డబ్బులు పంచినంత మాత్రాన గెలుపు సాధ్యం కాదన్న వాస్తవ విషయాన్ని ఇప్పటికే గ్రహించిన కేసీఆర్ వ్యూహాన్ని మార్చుకునే వీలుంది.
అభ్యర్థి ఎంపిక....
ముఖ్యంగా సరైన అభ్యర్థిని ఎంపిక చేయడం అక్కడ ముఖ్యమన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కేసీఆర్ ఇందుకు మళ్లీ సర్వేలను ఆశ్రయించవచ్చు. మునుగోడులో బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఈటల రాజేందర్ బంధుగణం కూడా ఎక్కువగా ఉంది. అందుకే అక్కడ ఆచితూచి అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. అందుకే కేసీఆర్ కు మునుగోడు ఎన్నికలో అభ్యర్థి ఎంపిక అంత సులువు కాదు. అందుకే ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాలను పక్కన పెట్టి సొంత రాష్ట్రంలోని మునుగోడుపై దృష్టి పెట్టడమే కాదు. నిత్యం దానిపై కసరత్తు చేయాల్సి ఉంది. ఇప్పుడు కేసీఆర్ ఫస్ట్ ప్రయారిటీ మునుగోడు. తర్వాతనే మిగిలిన ఇష్యూస్ అని చెప్పక తప్పదు. కేసీఆర్ నిర్ణయం ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News