రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని ప్రగతి రిసార్ట్లో గురువారం సాయంత్రం ఓ యువతి దారుణ హత్యకు గురైంది. కొత్తూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శిరీష (20) అనే డిగ్రీ విద్యార్థిని ఈ ఘటనలో బలయింది. మృతురాలి స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం సాయంత్రమే ఈ ఘటన చోటు చేసుకున్నప్పటికీ రాత్రి వరకూ వెలుగు చూడలేదు. రిసార్ట్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో శంకర్పల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అయితే పెళ్లి కాని వారిని రిసార్ట్స్ యాజమాన్యం లోపలికి ఎలా అనుమతిచ్చిందని శిరీష తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. రిసార్ట్స్ యాజమాన్యం కావాలనే దాచిపెడుతోందని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సాయిప్రసాద్ గా గుర్తించారు.