పీకే మరీ పాలిటిక్స్ ను పీక్ కు తీసుకెళుతున్నారా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అవసరానికి మించి ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మమత బెనర్జీ అభిప్రాయపడుతున్నారు

Update: 2021-12-23 06:13 GMT

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అవసరానికి మించి ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మమత బెనర్జీ అభిప్రాయపడుతున్నారు. తన ఇమేజ్ కంటే ఆయన శక్తి సామర్థ్యాలే టీఎంసీ గెలుపునకు పనిచేశాయని ప్రశాంత్ కిషోర్ బిల్డప్ ఇస్తున్నారని భావిస్తున్నారు. అందుకదే మమత బెనర్జీ ప్రశాంత్ కిషోర్ ను దూరం పెట్టడానికి టీఎంసీ రెడీ అయిపోయినట్లే కన్పిస్తుంది. పీకే వల్ల మమత ఇమేజ్ దేశ వ్యాప్తంగా దెబ్బతింటుందన్న అంచనాకు దీదీ వచ్చేసింది.

డబ్బులు తీసుకుని....
ప్రశాంత్ కిషోర్ ఒక ఎన్నికల వ్యూహకర్త మాత్రమే. ఆయన ఎన్నికల సమయంలో పార్టీలతో కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు సర్వేలు చేయించి నివేదికలను సమర్పిస్తారు. దానిని బట్టి అభ్యర్థుల ఎంపిక పార్టీ అధినేతల చేతుల్లోనే ఉంటుంది. పీకే నివేదిక ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేయాలన్న రూలేమీ లేదు. అయినా సర్వేలకు, తమ అంచనాలకు దగ్గరగా ఉంటే పార్టీ అధినేతలు టిక్కెట్ల కేటాయింపు చేస్తారు.
ఆ గెలుపులన్నీ తన ఖాతాలోనే...
ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తమిళనాడులో తన వ్యూహాల వల్లనే అక్కడ పార్టీలు గెలుస్తున్నాయని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నారు. కానీ అక్కడ పార్టీల అగ్రనేతల ప్రభావం కూడా పనిచేసిందని చెప్పడానికి ఒప్పుకోవడం లేదు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత పీకే మరీ పీక్ కు వెళ్లిపోయారు. దేశ వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయం గా కూటమిని ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్రాలను పర్యటిస్తున్నారు. బీజేపీకి తానే ప్రత్యామ్నాయం చేస్తున్నట్లు కలర్ ఇస్తున్నారు. కాంగ్రెస్ ను కూడా తన మాటలతో కలవరపెడుతున్నారు. దీదీ కన్నా దేశ వ్యాప్తంగా థర్డ్ ఫ్రంట్ విషయంలో తానే పాపులర్ అవ్వాలన్న ప్రయత్నంలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు.
పీకేను పక్కన పెట్టాలని....
ఈ నేపథ్యంలో మమత బెనర్జీ ప్రశాంత్ కిషోర్ వ్యవహారశైలిపై కొంత కినుక వహించారని తెలిసింది. అది ఒక ఏజెన్సీ మాత్రమేనని, దాని అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలా? లేదా? అన్నది తమ పార్టీ అధినేత్రి మమత బెనర్జీ నిర్ణయిస్తారని రాజ్యసభలో టీఎంసీ నేత డెరెక్ ఒబ్రియెన్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ తరుపున వారు మాట్లాడే హక్కులేదని, వారు మాట్లాడినా తమపార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. మమత మనసులో ఉన్న మాటను ఆయన చెప్పకనే చెప్పారు. దీంతో పీకే ఓవర్ యాక్షన్ ఇక కట్టిబెడితే బాగుంటుందని టీఎంసీ నేతలు పరోక్షంగా హెచ్చరించారన్న మాట.


Tags:    

Similar News