మద్యంబాబులకు షాక్.. న్యూయర్ డే లిక్కర్ షాపులు బంద్

జనవరి 1వతేదీన లిక్కర్ షాపులను మూసివేయాలని ఆదేశించింది. న్యూ ఇయర్ అంటే.. మందుబాబులకు పండుగ. ఎక్కడలేని మద్యమంతా ఏరులై

Update: 2021-12-24 07:53 GMT

చూస్తుండగానే 2021వ సంవత్సరం కూడా కరోనాతోనే గడిచిపోయింది. స్వల్ప లాక్ డౌన్లు, నిబంధనలతో 2021లోనూ ప్రజలు భయాందోళనల మధ్యే కాలం వెళ్లదీశారు. మరికొద్దిరోజుల్లో 2022 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. 2022 అయినా బావుంటుందా అంటే.. గ్యారెంటీ లేదు. వ్యాక్సినేషన్లతో కరోనా నుంచి ఇప్పుడిప్పుడే విముక్తి లభిస్తుందనుకునే లోపే.. ఒమిక్రాన్ నేనున్నానంటూ ప్రజలను పలుకరించింది. ఐరోపా దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. విదేశాల నుంచి భారత్ కు వచ్చే వారిలో ఎక్కువగా ఒమిక్రాన్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం మార్గదర్శకాలిచ్చింది.

మొత్తం మూడ్రోజులు బంద్
ఇక అనుకున్నట్లే కొన్ని రాష్ట్రాలు పండుగల నేపథ్యంలో.. పలు నిబంధనలు, ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓ రాష్ట్రం జనవరి 1వతేదీన లిక్కర్ షాపులను మూసివేయాలని ఆదేశించింది. న్యూ ఇయర్ అంటే.. మందుబాబులకు పండుగ. ఎక్కడలేని మద్యమంతా ఏరులై పారుతుంది. కోట్లలో జరిగే వ్యాపారాలతో.. గల్లా పెట్టెలు గలగలలాడుతాయి. ఇంతకీ ఏ రాష్ట్రంలో మద్యం షాపులు బంద్ అవుతున్నాయో తెలుసా ? కంగారు పడకండి. మన తెలుగు రాష్ట్రాల్లో కాదు.. మేఘాలయ రాష్ట్రంలో ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. డిసెంబర్ 24,25 తేదీల్లో, కొత్త సంవత్సరం మొదటి రోజున మద్యం దుకాణాలను మూసివేయాలని మేఘాలయ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు రాష్ట్రమంతా వర్తించవు. కేవలం ఈస్ట్ ఖాసి హిల్స్ జిల్లాకు మాత్రమే ఈ ఆదేశాలను జారీ చేశారట. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.


Tags:    

Similar News