తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. పార్లమెంటులో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమయమంతా నిరసనలకే సరిపోయిందని, ప్రజాసమస్యలను సభలో చర్చించలేకపోయామన్నారు. నిరసనల వల్ల ఉపయోగం ఏమీ ఉండదని తమకు తెలిసినా చేయాల్సి వచ్చిందన్నారు. నరేంద్రమోదీ మాట వినే రకం కాదని, ఏపీ సమస్యలను ఆయన పరిష్కరించరని తాను తొలి నుంచి చెబుతున్నానని జేసీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీజేపీయే కొంత బలం తగ్గినా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమేనని, కాంగ్రెస్ పార్టీ మరింత బలం పెంచుకోవాలని జేసీ అభిప్రాయపడ్డారు.