వరలక్ష్మీ వ్రతం రోజు ఆ పొరపాటు చేయొద్దు

శ్రావణ శుక్రవారం అంటే ఉదయాన్నే ఇంట్లో పూజలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది

Update: 2022-08-05 05:51 GMT

శ్రావణమాసం అంటేనే పండగలకు నెలవు. ఈ నెలలో పండగలు అన్ని వస్తాయి. ముఖ్యంగా శ్రావణమాసంలో వచ్చే పండగల్లో ముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం. మహిళలు అత్యంత ఇష్టంగా, భక్తి శ్రద్ధలతో చేసుకునే ఈ వ్రతం ఈ నెల 5వతేదీన జరగనుంది. ఈరోజు మహిళలకు ముఖ్యమైన రోజు. అమ్మవారు తాము కోరుకున్నది నెరవేరుస్తారన్న నమ్మకం ఉంచి పూజలు నిర్వహిస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో తన ఇంట్లోని కుటుంబ సభ్యులతో కలసి చేసుకునే ఈ పండగకు ఎన్నో విశిష్టతలున్నాయి.

ఇంట్లోనే పూజలు...
ముఖ్యంగా శ్రావణ శుక్రవారం అంటే ఉదయాన్నే ఇంట్లో పూజలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సంప్రదాయంగా సాయంత్రం వేళ పేరంటం నిర్వహించి ముత్తయిదువులకు వాయినం ఇచ్చే సంప్రదాయం కూడా ఉంది. అయితే సాయంత్రం వేళ కూడా అమ్మవారికి పూజలు నిర్వహించాలంటున్నారు పండితులు. కేవలం పూజలు చేయడమే కాకుండా దీపారాధన చేసి మళ్లీ నైవేద్యం పెట్టాలని సూచిస్తున్నారు.
ఉదయం పూట మాత్రమే...
సాధారణంగా ఉదయం పూట అమ్మవారికి దీపారాధన చేయడంతో పాటు నైవేద్యానికి వివిధ రుచులతో కూడిన పదార్థాలను తయారు చేస్తారు. అమ్మవారికి ఇష్టమైన తీపి పదార్థాన్ని తయారు చేసి ప్రసాదంగా పెడతారు. సాయంత్రం ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు ప్రసాదాన్ని తినిపించి వాయినాలు ఇచ్చుకుంటారు. ఉదయం పూజలు చేశాం కదా అని కొందరు మహిళలు అవగాహన లేక సాయంత్రం వేళ అమ్మావారికి నైవేద్యం పెట్టరు.
సాయంత్రం వేళ కూడా...
అయితే సాయంత్రం వేళ కూడా అమ్మవారికి దీపారాధన చేసి నైవేద్యం పెట్టాలని పండితులు సూచిస్తున్నారు. అప్పుడే పూర్తి స్థాయి ఫలితం దక్కుతుందని చెబుతున్నారు. ఉదయం పూజలు చేసి, నైవేద్యం అమ్మవారికి సమర్పించినా తిరిగి సాయంత్రం కూడా తీపి రుచులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతం రోజు ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయమని పండితులు సూచిస్తున్నారు. అప్పుడే ఆ ఇల్లు సుఖశాంతులతో వర్థిల్లుతుందని వేద పండితులు చెబుతున్నారు.


Tags:    

Similar News