మద్యంమత్తులో రెచ్చిపోయిన అమ్మాయిలు....!

Update: 2018-07-28 03:54 GMT

హైదరాబాద్ జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు జరిగాయి. అర్థరాత్రి దాటేవరకు పబ్బుల్లో డ్యాన్సులు.. ఆ తర్వాత కార్లలో షికార్లు చేస్తోంది యువత. పీకలదాకా తాగి తూలుతూ కార్లు నడుపుతూ యువతులు పట్టుబడుతున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 65లో డ్రంకన్ డ్రైవ్ లో యువతుల హంగామా సృష్టించారు. పబ్బుల్లో ఫుల్లుగా మందేసి... చిందేసి కారు స్టీరింగ్ పట్టిన యువతులు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు సహకరించకుండా మొండికేశారు. ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపించారు. మహిళా కానిస్టేబుల్ లేకుండా తమనెలా పరీక్షిస్తారని ప్రశ్నించారు. అప్పటికప్పుడు మహిళా పోలీసుల్ని రప్పించి..తనిఖీలు చేపట్టాల్సి వచ్చింది.

పట్టుబడ్డ టాలీవుడ్ సింగర్ ......

జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 65లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేసిన పోలీసులకు ఐదుగురు యువతులు చిక్కారు. మహిళా కానిస్టేబుల్ లేకుండా డ్రంకన్ డ్రైవ్ పరీక్షెలా చేస్తారంటూ ట్రాఫిక్ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు యువతులు. దాంతో అప్పటికప్పుడు మహిళా కానిస్టేబుల్ ను రప్పించి తనిఖీలు చేశారు. కొండాపూర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని శ్రావణి తాగిన మత్తులో TS 09 EE 1788 నెంబరు గల కారు నడుపుతూ వస్తుండగా.. ఆమెని బ్రీత్ అనలైజర్ తో పరీక్షించారు. శ్రావణికి రక్తంలో ఆల్కహాల్ 49 పాయింట్లు ఉన్నట్టు తేలింది. విశాఖపట్నానికి చెందిన ప్రీతమ్ మెహతా అనే యువతి తాగి AP 28 DX 4860 నెంబరు గల కారు నడుపుతుండగా.. కారుని ఆపి ఆమెకు శ్వాస పరీక్ష చేయగా 43 పాయింట్లుగా మద్యం మోతాదు నమోదైంది. సోమాజిగూడకు చెందిన సర్జిత్ కౌర్ TS 11 EK 5005 నెంబరు గలకారుని ఆపి.. బ్రీత్ అనలైజర్ తో పరీక్షిస్తే 86 పాయింట్లు వచ్చింది. తమిళనాడుకు చెందిన ప్రొణతినాయర్ TS 13 ED 9724 నెంబరు కారు నడుపుతూ వస్తుండగా.. ఆమెని ఆపి పరీక్షించగా.. ఆల్కహాల్ పర్సంటేజ్ 38 పాయింట్లుగా నమోదైంది. ఢిల్లీకి చెందిన స్నేహ AP 09 CS 2785 నెంబర్ గల కారును తాగి డ్రైవ్ చేయసాగింది. స్నేహను పరీక్షించగా.. 38 పాయింట్ల ఆల్కహాల్ ఆమె బ్లడ్ లో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. పట్టుబడ్డ ఐదుగురు యువతులు సాఫ్ట్ వేర్ ఉద్యోగులే కావడం గమనార్హం.

అతికష్టం మీద.....

యువతుల కార్లను సీజ్ చేసి.. వారిపై కేసులు బుక్ చేశారు పోలీసులు. తాగి దొరికిన యువతులు తమ కార్లను అప్పగించమంటూ మొండికేశారు. బతిమిలాడి.. బుజ్జగించి చివరికి ఎలాగోలా అతికష్టమ్మీద మత్తులో ఉన్న మగువల్ని కార్లలోంచి దింపేశారు పోలీసులు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లలోని ఐదు ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో 126 మంది పట్టుబడ్డారు. 62 కార్లు, 64 బైకుల్ని సీజ్ చేశారు. వీరిలో ఐదుగురు యువతులున్నారు. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ వచ్చే రోడ్డులో టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లీగంజ్ తాగిన మైకంలో కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనికి బ్రీత్ అనలైజర్ తో పరీక్షించగా మద్యం మోతాదు 178 పాయింట్లు వచ్చింది. రాహుల్ సిప్లీసింగ్ పోలీసులకు సహకరించకుండా వాగ్వివాదానికి దిగాడు. అతనిపై కేసు బుక్ చేసి.. కారును సీజ్ చేశారు. ఇక డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ యువతులకు, మందుబాబులకు కౌన్సిలింగ్ ఇచ్చాక.. కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు పోలీసులు.

Similar News