జోకులెయ్యమాకండి బాసూ...?

బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మొన్నటి వరకూ సైలెంట్ గానే ఉన్నా ఇటీవల కాలంలో యాక్టివ్ అయ్యారు

Update: 2021-12-25 02:39 GMT

కొన్ని క్యారెక్టర్లుంటాయి. అవి సినిమాల్లో కాసేపు ప్రేక్షకులను అలరించి వెళతాయి. అలాగే పొలిటికల్ స్క్రీన్ పైన కూడా అలాంటి కేరెక్టర్లే ఉంటాయి. అవి కూడా అంతే. వచ్చి అలా జోకులు పేల్చిపోతుంటాయి. అలాంటి వారిలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఒకరు. సీఎం రమేష్ మొన్నటి వరకూ సైలెంట్ గానే ఉన్నా ఇటీవల కాలంలో యాక్టివ్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ పుణ్యమా అని రెండు సార్లు రాజ్యసభ పదవి దక్కింది.

బీజేపీలోకి వెళ్లినా....
2019లో పార్టీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన బీజేపీలోకి జంప్ చేశారు. కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసింది లేదు. గెలిచింది లేదు. తన వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం కోసం ఆయన రాజ్యసభ పదవినే కోరుకుంటారు. బీజేపీలో ఉన్నప్పటికీ ఆయన తన పూర్వపు మూలాలను ఎన్నడూ మరిచిపోరు. సైకిల్ పార్టీకి పరోక్షంగా భక్తి శ్రద్ధలతో పనిచేస్తుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వంపై ఆయన కాలుదువ్వుతున్నారు.
పనితీరుపై...
వైసీపీ ప్రభుత్వంలో పోలీసుల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం టెలిస్కోప్ లో నిశితంగా చూస్తుందట. అవసరమైతే ఐపీఎస్ అధికారులను రీకాల్ చేస్తామని కూడా సీఎం రమేష్ హెచ్చరించారు. ఏపీలో శాంతిభద్రతల సమస్య తీవ్రంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. త్వరలోనే మీరు చూస్తారంటూ సీఎం రమేష‌ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇలా ఎందుకు ఈయన రియాక్ట్ అవుతున్నారన్నది అందరికీ తెలిసిందే.
బాబు కోసమేనట...
పాపం టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారు. మాజీ మంత్రుల నుంచి కిందిస్థాయి నేతల వరకూ కేసులు ఎదుర్కొనాల్సి వస్తోంది. చివరకు పెద్దాయన అశోక్ గజపతి రాజుపైన కూడా కేసు నమోదయింది. దీంతోనే సీఎం రమేష్ కు ఆగ్రహం కల్గిందంటున్నారు. అందుకే ఏపీ ప్రభుత్వంపైనా, పోలీసులపైనా ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటున్నారు. కాషాయం కండువా కప్పుకున్నా ఆయన చూపంతా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలవడంపైనే ఉంది. పశ్చిమ బెంగాల్ లో ఇలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అక్కడ బీజేపీ ఎటు కాకుండా పోయింది. అసలు ఏమీ లేని చోట కేంద్రం వేలు పెడితే అది జగన్ కే అడ్వాంటేజీగా మారుతుందన్న విషయాన్ని సీఎం రమేష్ మర్చిపోయినట్లున్నారు.


Tags:    

Similar News