కేసీఆర్ ముందస్తు వ్యూహం.. కమలంలో అదే భయం

కేసీఆర్ ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే ఖచ్చితంగా రాష్ట్రపతి పాలనను తెలంగాణలో పెడతామని బీజేపీ నేతలు చెబుతున్నారు

Update: 2022-11-30 04:52 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు బీజేపీ చెక్ పెట్టే ప్రయత్నాల్లో ఉందా? కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే అందుకు విరుగుడును ముందే ఆలోచించి ఉంచుకుందా? అంటే పార్టీ నేతల వ్యాఖ్యలను బట్టి అదే అర్థమవుతుంది. కేసీఆర్ ఒకవేళ ముందస్తు ఎన్నికలకు వెళితే ఖచ్చితంగా రాష్ట్రపతి పాలనను తెలంగాణలో పెడతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు బీజేపీ సిద్ధంగా లేదా? అన్న ప్రశ్న పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతుంది. ముందుగా ఎన్నికలు జరిగితే గత ఎన్నికల ఫలితాల రిపీట్ అవుతాయన్న భయం బీజేపీలో ఉందంటున్నారు. ముందస్తు ఎన్నికలు జరిగితే అభ్యర్థుల ఎంపిక కూడా కష్టమవుతుందని బీజేపీ వెనక్కు తగ్గుతుందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.


గత ఎన్నికల్లో...

గతంలో బీజేపీతో సంబంధాలు బాగున్నప్పుడు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ముందస్తు ఎన్నికలకు సహకరించింది. 2019 లో జరగాల్సిన ఎన్నికలు 2018లోనే జరిగాయి. రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీల మధ్య సఖ్యత లేదు. ఉప్పు నిప్పులా ఉన్నాయి. ఒకరి పై ఒకరు కేసులు పెట్టుకోవడానికి కూడా వెనకాడటం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలపై కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఐటీ, ఈడీ దాడులకు దిగుతుంటే, ఎమ్మెల్యేల ఎర కేసులో జాతీయ స్థాయి బీజేపీ నేతలనే టీఆర్ఎస్ టార్గెట్ చేసింది.
అసెంబ్లీని రద్దు చేసినా...
ఈ పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసినా ఏదో ఒక కారణం సాకుగా చూపి రాష్ట్రపతి విధించే అవకాశాలున్నాయంటున్నారు. రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరిగితే అది టీఆర్ఎస్ కు అడ్వాంటేజీ అవుతుందా? లేదా? అన్నది తర్వాత ప్రశ్న. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఉండరు. పోలీసు శాఖ కూడా పూర్తిగా పట్టు కేంద్రానికే దక్కుతుంది. అయితే రాష్ట్రపతి పాలన పెట్టారన్న సెంటిమెంట్ గులాబీ పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో బీజేపీ అంత సులువుగా రాష్ట్రపతి పాలన పెట్టే సాహసం చేయకపోవచ్చన్నది పార్టీలోని ఒక వర్గం వాదనగా ఉంది.

రాష్ట్రపతి పాలన ఆలోచన...
ముందుగా ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ కు లాభమెంతో తెలియదు కాని బీజేపీకి మాత్రం పెద్దగా ప్రయోజనం ఉండదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఆ పార్టీ నేతలు కూడా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. ఎంత ఆలస్యంగా ఎన్నికలు జరిగితే తమ పార్టీలోకి మరికొంత మంది నేతలు వచ్చే అవకాశముంది. 119 నియోజకవర్గాల్లోనూ బలమైన నాయకులను తయారు చేసుకునే వీలుంటుందన్నది బీజేపీ నేతల అభిప్రాయం. అందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతానంటూ ప్రభుత్వాన్ని రద్దు చేస్తే రాష్ట్రపతి పాలన పెడతామన్న సంకేతాలు వారు పంపుతున్నారంటున్నారు.


Tags:    

Similar News