Weather Report :మార్చి నెలాఖరు వరకూ తీపి కబురు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో నాలుగు రోజుల పాటు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో నాలుగు రోజుల పాటు వానలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని తెలిపింది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాటు ఉష్ణోగ్రతలు కూడా కనిష్టంగానే నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది.
మరో నాలుగు రోజులు...
ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజుల పాటు వానలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని, అలాగే ఉరుములు,మెరుపులతో కూడిన జల్లులు పడతాయని చెప్పింది. దీంతో పాటు ముప్ఫయి నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. మత్స్యకారులకు ప్రత్యేకమైన సూచనలు ఏవీ లేవని కూడా స్పష్టంచేసింది. అయితే రైతులు మాత్రం తమ పంట ఉత్పత్తుల విషయంలో వానకు తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
సాధారణం కంటే...
తెలంగాణలోనూ సాధారణం కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. వానలు కూడా పడతాయని చెప్పింది. తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముందని సూచించింది. బలమైన ఈదురుగాలులు, ఉరుములు,మెరుపులతో కూడి వానలు పడతాయని చెప్పింది. మార్చి నెల చివరి వరకూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని, ఏప్రిల్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని పేర్కొంది. అకాల వానలు రైతులను ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.