కేసీఆర్ కుటుంబాన్ని సాగనంపుతాం

కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకూ పాకిందని భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.

Update: 2022-08-27 12:25 GMT

కేసీఆర్ అవినీతి ఢిల్లీ వరకూ పాకిందని భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. తెలంగాణలో నయాం నిజాం పాలన సాగుతుందని తెలిపారు. వరంగల్ లో బండి సంజయ్ మహాసంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ప్రత్యేక హెలికాప్టర్ లో వరంగల్ కు చేరుకున్న జేపీ నడ్డాకు ఘన స్వాగతం లభించింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బాటలోనే కేసీఆర్ పయనిస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని జేపీ నడ్డా అన్నారు. తెలంగాణకు కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కల్పిస్తామని తెలిపారు.

ఎన్నో కుట్రలు...
తాము అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని జేపీ నడ్డా తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎంలా మార్చుకున్నారన్నారు. బండి సంజయ్ పాదయాత్ర సక్సెస్ అయిందన్నారు. టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అంధకారంలో ఉందన్నారు. అవినీతి పరిపాలనతో తెలంగాణను దోచేస్తున్నారని జేపీ నడ్డా ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ బందీ చేశారని విమర్శించారు. చివరకు ఈ సభను అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేశారని, అయినా ప్రజలు లక్షల సంఖ్యలో వచ్చి విజయవంతం చేశారన్నారు. పాదయాత్రను చేయకుండా బండి సంజయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. తెలంగాణకు తొలుత మద్దతిచ్చింది తామేనని చెప్పారు. కాకినాడ తీర్మానం ద్వారా తెలంగాణ వంటి రాష్ట్రాలకు మద్దతు తెలిపామని ఆయన అన్నారు.


Tags:    

Similar News