24 గంటలు.. రెండు అకౌంట్స్ క్లోజ్...?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ 24 గంటల్లో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Update: 2022-02-15 13:51 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ 24 గంటల్లో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి సీఎంవో కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ బదిలీ. రెండోది డీజీపీ స్థానం నుంచి గౌతం సవాంగ్ ను తప్పించడం. ఈ రెండు పాలనాపరమైన నిర్ణయాలు అయినప్పటికీ రాజకీయంగా కొంత చర్చకు దారి తీసింది. ప్రవీణ్ ప్రకాష్ తప్పుడు సలహాలు ఇవ్వడం, అర్ధరాత్రి జీవోలు ఇవ్వడం వల్లనే బదిలీ అయ్యారన్నది అధికార వర్గాల నుంచి తెలుస్తోంది.

డీజీపీ బదిలీ....
అదే డీజీపీ గౌతం సవాంగ్ తొలి నుంచి కొంత ప్రభుత్వానికి మద్దతుగానే ఉన్నారు. ఆయన జగన్ కు అత్యంత సన్నిహితుడుగా కూడా ఉన్నారు. అయితే ఇటీవల చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ కావడానికి పోలీసుల వైఫల్యమేనని జగన్ అభిప్రాయపడుతున్నారు. ఆ ఒక్క కార్యక్రమంతో తాను మూడేళ్లు సంపాదించుకున్న ఇమేజ్ పోయిందని జగన్ భావిస్తున్నారు. ఉద్యోగుల సమస్యల విషయంలో ప్రభుత్వం దిగి రావడానికి, ప్రభుత్వ ఖజానాపై భారం పడటానికి డీజీపీ వైఖరి కారణమని జగన్ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జరుగుతుంది.
ఎందుకు బదిలీ చేశారు?
అయితే దీనిపై రాజకీయ రచ్చ మొదలయింది. జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ డీజీపీ బదిలీపై స్పందించారు. డీజీపీని ఎందుకు మార్చాల్సి వచ్చిందో ప్రజలకు ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. చలో విజయవాడ సక్సెస్ అయినందునే డీజీపీ బదిలీ జరిగిందని భావించాల్సి ఉంటుందన్నారు. డీజీపీని బదిలీ చేసి ఉన్నతాధికారుల నుంచి చిరుద్యోగికి జగన్ హెచ్చరిక పంపారా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం ను కూడా ఆకస్మికంగా బదిలీ చేయడం ఈ సందర్బంగా గుర్తుకొస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు.
అధికారులు రూల్స్ పాటించాలి....
ీడీజీపీ గౌతం సవాంగ్ బదిలీపై టీడీపీ కూడా స్పందించింది. ముఖ్యమంత్రి చెప్పినట్లే చేస్తున్నా డీజీపీ గా గౌతం సవాంగ్ ను ఎందుకు బదిలీ చేశారని టీడీపీ పొలిటి బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. గతంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ కూడా ఇలాగే జరిగిందన్నారు. ఇప్పటికైనా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ విధులను గుర్తించి నిర్వహించాలన్నారు. రూల్స్ ప్రకారం వ్యవహరించాలని వర్ల రామయ్య హితవు పలికారు. జగన్ అధికారులను వాడుకుని కరివేపాకులా తీసి పారేస్తారన్న విషయాన్ని గుర్తించాలని వర్ల రామయ్య కోరారు. మొత్తం మీద ప్రవీణ్ ప్రకాష్, గౌతం సవాంగ్ బదిలీలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.


Tags:    

Similar News