సొంత పార్టీ నేతలపైనే 'రాములమ్మ' సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎక్కువ ఇతర పార్టీలపై నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు..

Update: 2023-09-22 03:47 GMT

తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎక్కువ ఇతర పార్టీలపై నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేవి ప్రతి రోజు చూస్తూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో సొంత పార్టీల్లోనే కుంపటి ఏర్పడుతోంది. ఇక తాజా పరిణామాలను చూస్తే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలలాగానే బీజేపీలోనే మొదలవుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు జోరందుకున్నాయి. పార్టీల్లో అంతర్గత విబేధాలు నెలకొంటున్నాయి. తాజాగా విజయశాంతి వ్యాఖ్యలతో బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏ మాత్రం ఆగడం లేదని మరోసారి స్పష్టమైపోతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ లోకి వచ్చిన తర్వాత దూకుడుగా రాజకీయాలలో ముందుకు వెళ్తానని అనుకున్న విజయశాంతి ఇప్పుడు సొంత పార్టీ పైన తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఫైర్ బ్రాండ్, స్టార్ క్యాంపైనర్ గా పేరున్న రాములమ్మ ప్రత్యర్థి పార్టీల నాయకులను విమర్శించడంలో తనకు తానే సాటి. అటువంటి విజయశాంతికి ప్రస్తుతం బీజేపీకి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఇటీవల పుకార్లు షికార్లు అయ్యాయి.

పార్టీ మారుతున్నారా..?

కాగా, ఇటీవల నుంచి రాములమ్మ పార్టీ మారుతున్నారన్న ప్రచారం కూడా జోరందుకుంటోంది. అంతేకాదు ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా సోనియాగాంధీ విషయంలో కూడా విజయశాంతి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వ్యక్తిగతంగా సోనియాగాంధీని అభిమానని అనడంతో ఆమె పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి. అయితే వీటిపై విజయశాంతి తాజాగా స్పందించింది. ట్వీట్లతో సంచలనం సృష్టించే విజయశాంతి తనపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మరో ట్వీట్‌ చేశారు. ఇప్పుడు రాములమ్మ తాజా ట్వీట్‌ బీజేపీ పార్టీలో కలకలం రేపుతోంది. పార్టీలో ప్రాధాన్యంపై అసంతృప్తితో ఉన్నారని, అందుకే అంత యాక్టివ్‌గా లేరన్న ప్రచారం కూడా జరుగుతోంది. రాములమ్మ చేసిన ఈ ట్వీట్‌ ఇప్పుడు హట్‌టాపిగ్గా మారింది. పార్టీలో కొందరు కావాలనే తనపై ఇలాంటి ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు విజయశాంతి. చిట్‌చాట్‌ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ నాకు అలవాటు లేదు.. అంటూ ఆ ట్వీట్‌లో అసహనం వ్యక్తం చేశారు విజయశాంతి.

పార్టీకి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు ఈ నెల 16 సమావేశంలో తాను స్పష్టంగా తెలియజేశానని ఈ ట్వీట్‌లో ప్రస్తావించారు. ఏం చెప్పానన్నవిషయాలు బయటకు లీకేజీల పేరుతో ఇవ్వడానికి తాను వ్యతిరేకిని అంటూ కొందరు నేతలపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ తెలిసి కూడా మా పార్టీకే చెందిన కొందరు నేతలు పనిగట్టుకుని రాములమ్మ దూరం అంటూ సోషల్‌మీడియాలో ప్రచారం చేయిస్తున్నారన్నది విజయశాంతి వాదన. అలాంటి ప్రచారం ఖండించదగ్గదంటూ తన స్టయిల్‌లో రియాక్ట్‌ అయ్యారు.



Tags:    

Similar News