Tiger : తెలంగాణలో పెద్దపులి సంచారం.. అలెర్ట్ అయిన అటవీ శాఖ
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో పెద్దపులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది
తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దుల్లో పెద్దపులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో పలు చోట్ల దాదాపు ఎనిమిది పులులు వరకూ సంచరిస్తున్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోకి ఈ పులులు ప్రవేశించాయని అంటున్నారు. జనసంచారంలోకి వస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. సరిహద్దు గ్రామాల్లో దండోరా వేస్తున్నారు. ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
అడవుల్లోకి వెళ్లేవారికి...
ముఖ్యంగా పశువుల కాపర్లు అడవుల్లోకి వెళ్లవద్దని సూచించారు. పులి ఏ క్షణమైనా దాడి చేసే అవకాశముందని, అందుకనే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తాజాగా కొమరం భీం జిల్లాలోని అమృతగూడ గ్రామంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. ఇటీవల కొందరు యువకులు రోడ్డుమీద దర్జాగా వెళుతున్న పులిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అందుకే పశువులతో ఎవరూ అడవుల్లోకి వెళ్లవద్దంటూ అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పొలం పనులకు వెళ్లే వారు కూడా గుంపుగానే వెళ్లాలని, అదీ ఉదయం పది గంటల తర్వాత వెళ్లి సాయంత్రం మూడు గంటలకు తిరిగి వచ్చేయాలని చెబుతోంది.