Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్.. అదే జరిగితే

గవర్నర్ ఆమోదంలో జాప్యంతో బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Update: 2025-09-03 03:42 GMT

గవర్నర్ ఆమోదంలో జాప్యంతో బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రత్యేక జీవో జారీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న పంచాయతీరాజ్ సవరణ బిల్లు, సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవలి కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్ల ఖరారు చేయడంతో దాని మేరకు రిజర్వేషన్లను పార్టీ పరంగా కల్పించి నిర్వహించాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది.

త్వరలో జరగనున్న...
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. శాసనసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ నుంచి ఆమోదం లభించడంలో జాప్యం జరుగుతుండటంతో ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయిందని, ఒకటి రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికారిక వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
స్థానిక సంస్థల్లో బీసీలకు...
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు 2018 పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్ 285(ఏ)కు సవరణ చేస్తూ ప్రభుత్వం ఇటీవలే శాసనసభలో బిల్లును ఆమోదింపజేసింది. అనంతరం ఆమోదం కోసం బిల్లును రాజ్‌భవన్‌కు పంపింది. అయితే, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ నుంచి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఈ క్రమంలో సోమవారం కాంగ్రెస్ నేతృత్వంలోని అఖిలపక్ష బృందం గవర్నర్‌ను కలిసి బిల్లును వెంటనే ఆమోదించాలని కోరింది. అయినప్పటికీ, రాజ్‌భవన్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 30వ తేదీలోగా...
మరోవైపు ఈ నెల 30వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ గడువు సమీపిస్తుండటంతో గవర్నర్ ఆమోదం కోసం వేచి చూడకుండా ప్రత్యేక జీవో ద్వారా రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన కుల గణన సర్వేలో వెల్లడైన జనాభా లెక్కల ఆధారంగా గ్రామ, మండల, జిల్లా పరిషత్ స్థాయిలలో బీసీలకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. ఈ పరిణామాలతో స్థానిక ఎన్నికల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతకు త్వరలోనే తెరపడనున్నట్లు స్పష్టమవుతోంది. మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో న్యాయపరమైన చిక్కులు వస్తాయా? లేదా? అన్న దానిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.


Tags:    

Similar News