కేసీఆర్ ను కాపాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Update: 2024-01-02 10:28 GMT

telangana cm revanth reddy supporting kcr says kishan reddy

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఊచలు లెక్కపెట్టాల్సిన కేసీఆర్‌ను కాంగ్రెస్ పార్టీ కాపాడుతోందని విమర్శించారు. కేసీఆర్‌కు మేలు చేసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోరుతూ కేంద్రానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేఖ ఎందుకు రాయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరుతో కేసీఆర్‌కు మేలు చేసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే ముందు ఎలాంటి భూపరీక్షలు చేయలేదని.. ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోందని ఆరోపించారు.

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా జీవో తెచ్చారని.. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో సీబీఐ విచారణకు అంగీకరిస్తుందా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలియాలన్నారు. రేవంత్ రెడ్డి సీబీఐకి లేఖ రాయాలని.. అప్పుడు విచారణ బాధ్యత కేంద్రం తీసుకుంటుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ లేదని, అందుకే బీఆర్ఎస్‌తో అవగాహన కుదుర్చుకున్నారని అన్నారు. తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వమిదని.. కుటుంబ పాలన వల్లే కేసీఆర్ ఓడిపోయారని కిషన్ రెడ్డి తెలిపారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచినా ఫలితం శూన్యమన్నారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారెంటీ అనే చర్చ బీజేపీలో ఎక్కడా జరగలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.


Tags:    

Similar News