చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి కుట్రలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోసమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు

Update: 2024-02-28 11:02 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోసమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 84 పిల్లర్లు ఉంటే కేవలం రెండు, మూడు మాత్రమే కుంగిపోయాయని.. కుంగిన పిల్లర్లకు రిపేర్ చేస్తే సరిపోతుందని అన్నారు. అలా చేయకుండా ప్రాజెక్ట్ మొత్తం ప్రమాదంలో ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ప్రాజెక్టు కొట్టుకుపోవాలనే మరమ్మతులు చేయడం లేదని ఆరోపించారు. బ్యారేజీ కొట్టుకుపోతే గోదావరి నదీ జలాలు ఏపీకి వెళ్తాయని, ఇది జరగాలనేదే రేవంత్ కుట్ర అని చెప్పారు. తన గురువు, టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే రేవంత్ ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎత్తులో ఉండే తెలంగాణలో గోదావరి జలాలను పారించడం కాళేశ్వరం ప్రాజెక్టుతోనే సాధ్యమయిందని వినోద్ చెప్పారు. దాదాపు 400 మీటర్ల ఎత్తుకు నదీ జలాలను ఎత్తి పోశామని, కోటి ఎకరాలకు సాగునీరు అందించామని అన్నారు.

మళ్ళీ అధికారం లోకి రావడం కష్టమేమీ కాదు: 
చేవెళ్ల సభలో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై వినోద్ విమర్శలు గుప్పించారు. అధికారమదంతో మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు అధికారంలో ఉంటుందో ప్రత్యేకంగా చర్చించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. పార్టీ నాయకులపై కాంగ్రెస్ శ్రేణులకే నమ్మకం ఉండదని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడితే తిరిగి తమ ప్రభుత్వమే వస్తుందని, అన్ని లోక్ సభ స్థానాలను గెలుచుకోవచ్చని వినోద్ అన్నారు.


Tags:    

Similar News