పొన్నాలకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి

పొన్నాల లక్ష్మయ్య పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం

Update: 2023-10-14 12:12 GMT

పొన్నాల లక్ష్మయ్య పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సారథ్యంలో బషీర్ బాగ్ చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. పొన్నాల పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బషీర్ బాగ్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. గాంధీ భవన్ ను రెడ్డి భవన్ గా మార్చి.. బీసీ నాయకులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. తక్షణమే రేవంత్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య కు క్షమాపణ చెప్పాలని.. లేని పక్షంలో రాళ్లతో కొట్టి దాడులు చేస్తామని హెచ్చరించారు.

పొన్నాల లక్ష్మయ్య రాజీనామా వ్యవహారంపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. నాలుగు దశాబ్దాలపాటు పార్టీలో ఉండి ఇప్పుడు రాజీనామా చేయడానికి సిగ్గుండాలని.. పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన ఆయన ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. ప్రజల్లో ఉండి సేవ చేస్తే ఎందుకు గెలవరని ప్రశ్నించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండి కూడా 40 వేల ఓట్లతో ఓసారి, 50 వేల ఓట్లతో ఇంకోసారి ఓడిపోయారని గుర్తు చేశారు. పార్టీ ఇంకా అభ్యర్థులను ఖరారే చేయలేదని అన్నారు. జనగామ టికెట్ కోసం ముగ్గురిని ఎంపిక చేస్తే అందులో పొన్నాల కూడా ఉన్నారని తెలిపారు. అభ్యర్థులు ఇంకా ఫైనల్ కాకుండానే రాజీనామా చేయడం వెనకున్న కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. చూస్తుంటే పార్టీని దెబ్బతీయడానికి, బలహీన పర్చడానికే ఆయన రాజీనామా చేసినట్టు ఉందని ఆరోపించారు. కార్యకర్తలకే బేషరతుగా క్షమాపణలు చెప్పి రాజీనామాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ ఒక్కడే టికెట్లు ఇవ్వడని, అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు. పార్టీలోని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ఖరారు చేసి టికెట్లు కేటాయిస్తుందని తెలిపారు.


Tags:    

Similar News