Jupally : కేసీఆర్ నిజం మాట్లాడు... కొత్త డ్రామాలు వేయొద్దు

ధనిక రాష్ట్రం అనిచెప్పి కేసీఆర్ ఇప్పుడు రైతుల పక్షాన ఉన్నట్లు మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు

Update: 2024-04-06 07:29 GMT

ధనిక రాష్ట్రం అనిచెప్పి కేసీఆర్ ఊదరగొట్టి ఇప్పుడు రైతుల పక్షాన ఉన్నట్లు మాట్లాడుతున్నారని కేసీఆర్ పై మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన కేసీఆర్ కు తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. రైతులను తమ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని ఆయన తెలిపారు. పార్లమెంటు ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కేసీఆర్ తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. సభ్యత సంస్కారం లేకుండా కేసీఆర్ మాట్లాడుతున్నారన్నారు.

గత పదేళ్లలో...
అధికారంలో ఉన్న పదేళ్ల లో కేసీఆర్ ఏనాడైనా రైతుల బాగోగులను పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, అది లేక ఆయన పొలం బాట అంటూ ఇప్పుడు కొత్త డ్రామాలకు తెరతీశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను ఇక ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని, ఆయన డ్రామాలను ఎవరూ నమ్మరని జూపల్లి కృష్ణారావు అన్నారు. గత పాలనలో చేసిన పాపాల కారణంగనే నేడు అనుభవిస్తున్నామని తెలిపారు.


Tags:    

Similar News