ధర్నా చౌక్ వద్ద భారీ నిర‌స‌న‌కు పిలుపునిచ్చిన‌ కాంగ్రెస్

రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు

Update: 2023-12-21 05:01 GMT

Congress protest at Dharna Chowk

రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీ భ‌వ‌న్‌లో గురువారం ఆయ‌న మాట్లాడుతూ.. పార్లమెంట్ లో ఇండియా కూటమి ఎంపీలను అక్రమంగా, అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసిన అంశాలపై ఇండియా కూటమి నిరసనకు పిలుపునిచ్చిన‌ట్లు వెల్ల‌డించారు.

పార్లమెంట్ లో 13వ తేదీన ఆగంతకులు చొరబడి స్మోక్‌ బాంబులు వేసిన అంశంలో.. హోమ్ మంత్రి పార్లమెంట్ లో ప్రకటన చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేసిందని.. ఇండియా కూటమి పార్లమెంట్ లో ప్రశ్నిస్తే లోక్ సభ, రాజ్యసభ లలో ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణం అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇండియా కూటమి రేపు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింద‌ని వెల్ల‌డించారు.

రేపు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వ‌ర‌కూ ధర్నా కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని వెల్ల‌డించారు. శ్రేణులు భారీగా తరలివచ్చి ధర్నాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అన్ని జిల్లా కేంద్రాలలో ఇండియా కూటమితో కలిసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా.. నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.



Tags:    

Similar News