బీజేపీలో అసంతృప్తి సెగలు

తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైపోయింది. వివిధ పార్టీలు తమ దూకుడు పెంచాయి. ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ..

Update: 2023-10-23 12:50 GMT

తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైపోయింది. వివిధ పార్టీలు తమ దూకుడు పెంచాయి. ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక నిన్న బీజేపీ 52 మందిలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎంతో కసరత్తు చేసి బీజేపీ అధిష్ఠానం విడుదల చేసిన తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా ఆ పార్టీలో అసంతృప్తి చిచ్చు మొదలైంది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా బీజేపీ టికెట్‌ ఆశించిన చాలా మంది నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇలా.. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీలో టికెట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. తొలి జాబితాలో చాలా మంది పేరు లేకపోవడంతో అసంతృప్తి రాగాలు మొదలయ్యాయి.

కిషన్ రెడ్డి వద్ద క్యూలు కట్టిన నేతలు

విడుదలైన జాబితాలో ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసి తన ఆవేదనను తెలియజేశారు. అటు పటాన్‌చెరు టికెట్‌ నందీశ్వర్‌ గౌడ్‌కు కేటాయించడాన్ని కొంత మంది బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన విషయంలో 8 మంది మండల, డివిజన్‌ బీజేపీ అధ్యక్షులు అల్టిమేటం జారీ చేశారు.

 విక్రమ్‌ గౌడ్‌ నిరాశ

ఇక వరంగల్‌ వెస్ట్‌ స్థానాన్ని ఆశించిన రాకేష్‌ తీవ్ర అసంతృప్తికి గురై కంట పెట్టుకున్నారు. అలాగే గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు ఎత్తేసి మళ్లీ ఆయనకే టికెట్‌ కేటాయించడంతో ఆ స్థానాన్ని ఆశించిన విక్రమ్‌ గౌడ్‌ నిరాశకు గురయ్యారు. తనకు మరో నియోజకవర్గం నుంచైనా అవకాశం కల్పించాలని ఆయన కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీ మోహన్‌ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి పంపించారు.

విలపించిన రమాదేవి

అలాగే ముథోల్‌ టికెట్‌ దక్కకపోవడంతో నిర్మల్‌ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి పార్టీకి రాజీనామా చేశారు. ముథోల్‌ టికెట్‌ను బీజేపీ రామారావు పటేల్‌కు కేటాయించింది. కాంగ్రెస్‌ నేతగా ఉన్న రామారావ్‌ పటేల్‌ ఈ మధ్యే బీజేపీలో చేరారు. టికెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రమాదేవి ఈ పరిణామాన్ని తట్టుకోలేకపోయారు. కన్నతల్లి లాంటి పార్టీ తనకు అన్యాయం చేసిందని కన్నీరుమున్నీరయ్యారు. నర్సాపూర్‌, రామగుండం, ఆదిలాబాద్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆదిలాబాద్‌ టికెట్‌ పాయల్‌ శంకర్‌కు ఇవ్వడంపై అక్కడి బీజేపీ నేతల్లో వ్యతిరేకత ఎదురవుతోంది.

Tags:    

Similar News