సీఎం కేసీఆర్ ను కలవనున్న కేజ్రీవాల్

Update: 2023-05-27 02:20 GMT

ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో సమావేశమవ్వనున్నారు. ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులందరి పోస్టింగ్‌లు, బదిలీలపై తుది నిర్ణయం తీసుకునేందుకు లెఫ్టినెంట్ గవర్నర్‌కు అధికారాలను ఇస్తూ తీసుకుని వచ్చిన కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ దేశంలోని పలు పార్టీల మద్దతును కూడగడుతున్నారు. సీఎం కేసీఆర్ మద్దతు కోరడానికి కేజ్రీవాల్ హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. కేజ్రీవాల్‌తో పాటు ఇతర ఆప్ నేతలు కేసీఆర్‌ను కలవనున్నారు. త్వరలో పార్లమెంట్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బిల్లును వ్యతిరేకించాలని కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ఎంపీలను కేజ్రీవాల్‌ కోరనున్నారు. వివిధ రాష్ట్రాల్లోని పలు పార్టీల నేతలతో కేజ్రీవాల్ భేటీ జరిగింది. ఇప్పుడు కేసీఆర్ తో భేటీ కూడా భేటీ అవ్వనున్నారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఆయన ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేలను కలిశారు.

ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి మాట్లాడుతూ, ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కోరేందుకే కేజ్రీవాల్ కేసీఆర్‌ను కలుస్తున్నారని చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇరువురు పార్టీల అధినేతల భేటీకి చాలా ప్రాధాన్యత సంతరించుకుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవలే జాతీయ పార్టీ హోదా పొందిన ఆప్ అందులో కీలక పాత్ర పోషిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బెనర్జీ, పవార్, ఉద్ధవ్‌లను కలిసిన తర్వాత కేజ్రీవాల్ తెలంగాణకు వస్తున్నారు. జాతీయ స్థాయిలో పొత్తు కుదుర్చుకుంటే ఈ పార్టీలు కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి.


Similar News