Sankranthi : కోడిపందేలకు అన్నీ రెడీ... బరులు సిద్ధమవుతున్నాయ్
ఏపీలో కోడి పందేలు లేకుండా సంక్రాంతి వేడుకలు జరగవు
సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్ లో కోడిపందేలు గ్యారంటీ. ఏపీలో కోడి పందేలు లేకుండా సంక్రాంతి వేడుకలు జరగవు. అప్పుడే పందెం కోళ్లు రెడీ అయిపోయాయి. బరులు కూడా సిద్ధమవుతున్నాయి. గ్రామ స్థాయిలో ఉన్న నేతల నుంచి ఎమ్మెల్యేల వరకూ సొంత బరులను ఏర్పాటు చేసుకుని కోడిపందేలను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. సంక్రాంతి అంటేనే ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద పండగ. మూడు రోజుల పాటు జరిగే ఈ పండగలో అనేక విశిష్టతలున్నప్పటికీ సంక్రాంతి సంబరాల్లో ముఖ్యంగా గుర్తుకొచ్చేది కోడి పందేలు. పందె కోళ్లు కాలు దువ్వుతుంటే ఆ కిక్కే వేరప్పా అన్నట్లుంది పందెంగాళ్ల పరిస్థితి. కోడిని అనేక నెలల పాటు పెంచి బరిలోకి దించి కత్తితో ఎదుటి కోడిపై దాడి చేస్తుంటే చూడాలి నా సామిరంగా.. ఆ ఆనందం ఎక్కడా కనిపించదు.
ఈ రెండు జిల్లాల్లోనే...
కోడిపందేలకు ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలు ప్రత్యేకం. ప్రత్యేకంగా ఇందుకోసం బరులను తయారు చేస్తారు. ఎలా ఉంటాయంటే.. ఖరీదైన కార్లు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఈ కోడిపందేలకు హాజరవుతారు. కేవలం ఏపీ నుంచి మాత్రమే కాదు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఉన్న వారితో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లు సయితం కోడిపందేలు చూసేందుకు తరలి వస్తారు. కోడిపందేలు చూడకపోతే పండగ సక్రమంగా జరగనట్టేనని భావిస్తారు. అందుకే సంక్రాంతి పండగ వేళ జరుగుతున్న కోడి పందేల కోసం వేల సంఖ్యలో జనం ఎదురు చూస్తుంటారు. కోడి పందేల కోసం ఏడాదంతా కోడి పుంజులను బరిలోకి దింపేందుకు సన్నద్ధం చేస్తుంటారు. వాటికి బలిష్టమైన ఆహారం ఇవ్వడంతో పాటు వివిధ రకాల ఎక్సర్సైజులు కూడా చేయిస్తారు. స్విమ్మింగ్ కూడా చేయిస్తారు. పందెం కోళ్లను సిద్ధం చేయడానికి ప్రత్యేకంగా కొందరిని నియమించుకుంటారు. వేల రూపాయలు జీతాలిచ్చి వీరిని అందుకోసమే వినియోగిస్తారు.
సోషల్ మీడియాలో సమాచారం...
ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలలో కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. కేవలం డబ్బులే కాదు... గెలిచి వచ్చిన కోడిని ఊరేగింపుగా తీసుకెళ్లి తన ఇంట్లో మనిషిగా చూసుకుంటారు. అలాంటి కోడిపందేల కోసం ఇప్పుడే అంతా సిద్ధమయింది. పోలీసులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తారు. అధికార పార్టీ నేతలు బరులను ఏర్పాటు చేయడంలో ముందుంటారు. భీమవరం, నరసాపురం, రాజమండ్రి ప్రాంతాల్లో హోటల్ రూమ్ లుకూడా ముందుగానే బుక్ చేసుకుని సంక్రాంతికి వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు అనేక మంది. ఫ్లైట్ టిక్కెట్ లు కూడా ముందుగానే బుక్ అవుతున్నాయి.ఎక్కడ ఏ బరి ఉంది? అక్కడ ఏ సౌకర్యాలున్నాయన్న దానిపై సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచారం మొదలయింది. ఫుడ్ దగ్గర నుంచి అన్ని రకాలుగా వినోదాలను బరుల దగ్గర సిద్ధం చేస్తున్నారు. దీంతో సంక్రాంతి పండగకు ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లే వారికి సులువుగా సమాచారం లభిస్తుంది.