జమ్ముకశ్మీర్లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. పాక్, చైనాలకు సంబంధించిన ఆయుధాలు స్వాధీనం

ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లా ఉరీలోని హత్ లంగా సెక్టార్లో భద్రతా దళాలు, జమ్ముకశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో..

Update: 2022-12-25 11:36 GMT

jammu and kashmir

జమ్ముకశ్మీర్ లో భారీ ఉగ్రకుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. ఉగ్రవాదుల ప్రణాళికలను భారత సైన్యం తిప్పికొట్టింది. బారాముల్లా జిల్లాలోని యూరి సెక్టార్లో ఉగ్రవాదుల భారీ డంప్ ను సైనయం స్వాధీనం చేసుకుంది. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా జిల్లా ఉరీలోని హత్ లంగా సెక్టార్లో భద్రతా దళాలు, జమ్ముకశ్మీర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో శనివారం ఉగ్రవాదుల భారీ డంప్ లభ్యమైందని భద్రతా దళాలు తెలిపాయి. అందుకు సంబంధించిన వివరాలను ఆదివారం వెల్లడించాయి. ఈ తనిఖీల్లో 8 AK-74U రైఫిళ్లు, 24 AK-74 మ్యాగజైన్స్, 12 చైనీస్ పిస్టల్, 24 పిస్టల్ మ్యాగజైన్లు, 9 చైనీస్ గ్రెనేడ్లు, 5 పాక్ గ్రెనేడ్లు, 5 గోధుమ సంచులు, 81 పాక్ బెలూన్లు, 560 రౌండ్ల ఎకె-47, 244 పిస్టల్స్ బుల్లెట్లు, పాక్ జెండాలు, బెలూన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి. ఈ డంప్ లో పాకిస్థాన్ తో పాటు చైనాకు చెందిన పిస్టల్స్ లభ్యమవడం కలకలం రేపింది.

కాగా.. ఎల్ఓసీ నుండి ఉగ్రవాదులు భారీ దాడి చేసేందుకు ప్లాన్ చేసినట్లుగా ఆర్మీ గుర్తించింది. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో చురుకైన ఉగ్రవాదుల సంఖ్య తగ్గిపోయిందని బారాముల్లాలోని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కశ్మీర్లో ఉగ్రవాదుల సంఖ్యను తగ్గించడంలో భద్రతా బలగాలు చాలా వరకు సఫలమయ్యాయని పేర్కొన్నారు. లాంచింగ్ ప్యాడ్లపై ఉగ్రవాదులు ఉన్నారన్న ప్రశ్నకు ఆర్మీ ఉన్నతాధికారి స్పందిస్తూ.. లాంచింగ్ ప్యాడ్లపై ఉగ్రవాదులు ఉన్నారనడానికి ఖచ్చితమైన సమాచారం లేదని తెలిపారు. అయితే ఎల్ఓసి వెంబడి మోహరించిన ఉగ్రవాదులు, దళాలు తమకు ఇబ్బంది కలిగిస్తున్నాయని చెప్పారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని వెల్లడించారు.


Tags:    

Similar News