దిగ్విజయ్ సింగ్ కూడా దూరమే

దిగ్విజయ్ సింగ్ నిర్ణయంతో ఇప్పుడు పోటీ శశిథరూర్, ఖర్గే మధ్యే ఉండనుంది. గాంధీ కుటుంబం విధేయుడిగా పేరున్న ఖర్గేనే విజయం

Update: 2022-09-30 07:39 GMT

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నామినేషన్‌కు చివరి రోజున దిగ్విజయ్ సింగ్‌ రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అధ్యక్ష పదవికి మల్లికార్జున్ ఖర్గే పోటీ చేసున్నందునే తాను బరిలో నిలవడం లేదని చెప్పారు. ఖర్గేకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ రాష్ట్రంలో రాజకీయ గందరగోళం మధ్య పోటీ చేయకూడదని తన నిర్ణయాన్ని ప్రకటించడంతో ఖర్గే గురువారం రేసులోకి వచ్చారు.

దిగ్విజయ్ సింగ్ నిర్ణయంతో ఇప్పుడు పోటీ శశిథరూర్, ఖర్గే మధ్యే ఉండనుంది. గాంధీ కుటుంబం విధేయుడిగా పేరున్న ఖర్గేనే విజయం సాధించే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో తానూ పోటీ చేస్తానని జార్ఖండ్ నేత కేఎన్ త్రిపాఠి ప్రకటించారు. మధ్యాహ్నం నామినేషన్ సమర్పిస్తానని చెప్పారు.
గాంధీ కుటుంబం ఎన్నికలకు దూరంగా ఉండటంతో 25 ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబానికి చెందని వారు పార్టీ పగ్గాలు చేపట్టనున్నారు. 1994లో పీవీ నరసింహారావు చివరిసారిగా కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. శశిథరూర్, ఖర్గేలో ఎవరు గెలిచినా మరోసారి ఆ పదవి చేపట్టిన దక్షిణాది నేతగా అరుదైన ఘనత సాధిస్తారు. వీవీ నరసింహారావు తర్వాత 1996-98 వరకు సీతారాం కేసరి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత నుంచి 2017వరకు సోనియా గాంధీనే ఆ పదవిలో కొనసాగారు. ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల ప్రాధికార సంస్థ చైర్మన్ ఎం మిస్త్రీ తెలిపారు. "ఈరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరైనా నామినేషన్ ఫారమ్‌ను సమర్పించవచ్చు." అని ఆయన చెప్పారు.


Tags:    

Similar News