ఎన్నికలకు ముందు ఊహించని రాజీనామా!

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే రానుంది. ఎన్నికలు ఏప్రిల్-మేలో నిర్వహించే అవకాశం ఉందని

Update: 2024-03-10 03:03 GMT

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే రానుంది. ఎన్నికలు ఏప్రిల్-మేలో నిర్వహించే అవకాశం ఉందని.. త్వరలోనే ప్రకటన రాబోతోందని దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్న కొన్ని రోజుల ముందు, ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను అధ్యక్షుడు ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఆయన ఎందుకు పదవికి రాజీనామా చేశారో ఇంకా తెలియరాలేదు. ఆయన పదవీ కాలం మరో మూడేళ్లు ఉండగా.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొన్నిరోజుల ముందు రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన రాజీనామాకు కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు.

గోయల్ 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2022 నవంబర్ 18న ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనుండగా, ఆయన స్థానంలో అరుణ్ గోయల్ నియమితులయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ఊహించని విధంగా అరుణ్ గోయెల్ రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. అరుణ్ గోయెల్ లోక్ సభ ఎన్నికల సన్నాహాల్లో ఇటీవల చురుగ్గా పాల్గొన్నారు.. ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పలు రాష్ట్రాల పర్యటనలు చేపట్టారు. గోయల్ రాజీనామాతో మొత్తం ఎన్నికల యంత్రాంగాన్ని పర్యవేక్షించే బాధ్యత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌పై పడింది. అరుణ్ గోయెల్ పంజాబ్ కేడర్‌కు చెందిన మాజీ IAS అధికారి, అతను నవంబర్ 21, 2022న అధికారికంగా ఎన్నికల కమీషనర్ పాత్రను స్వీకరించాడు. అతని పదవీకాలం 2027లో ముగియనుంది. గోయెల్ గతంలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. ఇక వచ్చే వారం లోక్‌సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని అంచనాలు ఉన్నాయి.


Tags:    

Similar News