Iran : ఇరాన్ లో కొనసాగుతున్న టెన్షన్.. వీధుల్లో ఆందోళనలు
ఇరాన్లో నిరసన ఉద్యమం కొనసాగుతుంది
ఇరాన్లో నిరసన ఉద్యమం కొనసాగుతుంది. శుక్రవారం మరింత ఊపందుకుంది. ఇస్లామిక్ రిపబ్లిక్కు వ్యతిరేకంగా గత మూడు సంవత్సరాల్లో ఇదే అతిపెద్ద ఉద్యమంగా మారింది. అణిచివేత చర్యలలో భాగంగా అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఈ చర్యల నేపథ్యంలో ఇప్పటివరకు డజన్ల సంఖ్యలో మరణాలు సంభవించినట్లు సమాచారం. జీవన వ్యయం పెరగడంపై ఆగ్రహంతో ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పటికే 13 రోజులు పూర్తి చేసుకుంది. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత దేశాన్ని పాలిస్తున్న మతాధికార వ్యవస్థకు ముగింపు పలకాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఆందోళనలు ఉధృతం...
అప్పట్లో పశ్చిమ దేశాలకు అనుకూలంగా ఉన్న షాను ఆ ఉద్యమం గద్దె దించింది. టెహ్రాన్లోని సాదతాబాద్ ప్రాంతంలో ప్రజలు తమ చేతిలో ఉన్న పాత్రలను మోగిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “ఖామెనీకి మృతి” అంటూ నినాదాలు వినిపించారని ఏఎఫ్పీ ధ్రువీకరించిన వీడియోలో కనిపించింది. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖామెనీని ఉద్దేశించి ఈ నినాదాలు చేశారు. నిరసనలకు మద్దతుగా వాహనాలు హారన్లు మోగించాయి. టెహ్రాన్లోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి ఆందోళనలు జరిగాయని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి.
భారీ సంఖ్యలో వీధుల్లోకి...
అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం తూర్పు నగరం మష్హద్, ఉత్తరాన ఉన్న తబ్రిజ్, పవిత్ర నగరం ఖోమ్లో భారీ సంఖ్యలో ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు.2022–23లో మహ్సా అమినీ మరణం తర్వాత చెలరేగిన ఉద్యమం తరువాత ఇరాన్లో ఇవే అతిపెద్ద నిరసనలుగా నిలిచాయి. మహిళల దుస్తుల నియమాలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై అరెస్టు చేసిన కస్టడీలో ఆమె మృతి చెందడం అప్పట్లో దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రగిలించింది. ఇదిలా ఉండగా, ఇంటర్నెట్ పర్యవేక్షణ సంస్థ నెట్బ్లాక్స్ గత 24 గంటలుగా దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారని వెల్లడించింది. ఇది ఇరానీయుల హక్కుల ఉల్లంఘన అని, ప్రభుత్వ హింసను దాచిపెట్టే ప్రయత్నంగా అభివర్ణించింది.