Iran - Israel War : మరో వారం రోజులు విమానాలు నడవట.. ఇప్పటికింతేనట

అమెరికా–ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై చేపట్టిన యుద్ధం మధ్యప్రాచ్య దేశాల్లో విమాన రాకపోకలను తీవ్రంగా దెబ్బతీసింది

Update: 2026-03-04 06:24 GMT

అమెరికా–ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై చేపట్టిన యుద్ధం మధ్యప్రాచ్య దేశాల్లో విమాన రాకపోకలను తీవ్రంగా దెబ్బతీసింది. వేలాది మంది ప్రయాణికులు వివిధ దేశాల్లోనే నిలిచిపోయారు. పరిస్థితి ఎటు దారి తీస్తుందన్న దానిపై స్పష్టత లేదు. నిపుణులు చెబుతున్నదేమిటంటే… వచ్చే రోజులు, వారాల్లో కూడా విమాన సేవలు అంతరాయానికి గురయ్యే అవకాశం ఉంది. గల్ఫ్‌ దేశాల్లో ప్రతీకార దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపించొచ్చు. మధ్యప్రాచ్యానికి మాత్రమే కాదు, యూరప్‌, ఆఫ్రికా, ఆసియా వెళ్లే ప్రయాణికులకు గల్ఫ్‌ విమానాశ్రయాలు కీలక మార్గాలు. అనేక దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో చాలా విమాన సంస్థలు కొన్ని సర్వీసులను రద్దు చేశాయి. మరికొన్ని సుదీర్ఘ మార్గంలో ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాయి.

అవసరం లేని ప్రయాణాలను...
దీనివల్ల నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయి. యుద్ధం కొనసాగితే ఇంధన వ్యయం మరింత పెరిగి టికెట్‌ ధరలు కూడా ఎగిసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, రీఫండ్‌–ఇన్సూరెన్స్‌ నిబంధనలు పరిశీలించాలని, భద్రతా సూచనలు గమనించాలని సూచిస్తున్నారు. “ఇది సాధారణ ఆలస్యాల విషయం కాదు. ఇది యుద్ధ ప్రాంత గగనతలం సమస్య,” అని ఫ్లైట్‌ సేఫ్టీ ఫౌండేషన్‌ అధ్యక్షుడు, సీఈఓ హసన్‌ షాహిదీ అన్నారు. “విమాన సంస్థలు, విమానాశ్రయాలు, ప్రభుత్వాల సూచనలు గంటగంటకూ మారొచ్చు. ప్రయాణికులు అనిశ్చితిని తప్పక ఎదుర్కొంటారు,” అని ఆయన పేర్కొన్నారు. వారాంతంలో అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు ప్రారంభించిన తర్వాత పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇరాన్‌లో వందలాది మంది మృతి చెందినట్టు అక్కడి అధికారులు ప్రకటించారు.
అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరికలివే...
అమెరికా విదేశాంగ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్‌, ఇజ్రాయెల్‌తో పాటు ఖతార్‌, బహ్రెయిన్‌, ఈజిప్ట్‌, ఇరాక్‌, జోర్డాన్‌, కువైట్‌, లెబనాన్‌, ఒమాన్‌, పాలస్తీనా ప్రాంతాలు, సౌదీ అరేబియా, సిరియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, యెమెన్‌ల నుంచి అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల ద్వారా వెంటనే బయటకు రావాలని అమెరికా పౌరులకు సూచించింది. విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో అమెరికన్ల తరలింపుపై సమాచారం విస్తృతంగా ప్రచారం చేయాలని మీడియాను కోరారు. చైనా, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ వంటి దేశాలు కూడా తమ పౌరులను తరలించే చర్యలు ప్రారంభించాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రభుత్వాలు, రాయబార కార్యాలయాల నుంచి వచ్చే ప్రయాణ సూచనలను తరచుగా పరిశీలించాలి. భారీగా రద్దులు, గగనతలాన్ని మూసివేసిన కారణంగా ఇప్పటికే అనేక మంది చిక్కుకుపోయారు. కాబట్టి ముందుగా బుక్‌ చేసిన ప్రయాణాలను మళ్లీ ఆలోచించడం మంచిదని చెబుతున్నారు.
రీఫండ్‌, ఇన్సూరెన్స్‌ నిబంధనలివీ...
“అవసరం లేని ప్రయాణమైతే వాయిదా వేసుకోండి. తప్పనిసరి అయితే రీఫండ్‌ లేదా తేదీ మార్చుకునే సౌకర్యం ఉన్న టికెట్లు తీసుకోండి,” అని షాహిదీ సూచించారు. అబుదాబి, దుబాయ్‌ కేంద్రాలుగా పనిచేసే ఎతిహాద్‌ ఎయిర్వేస్‌, ఎమిరేట్స్‌, దోహా కేంద్రంగా ఉన్న ఖతార్‌ ఎయిర్ వేస్‌ కొన్ని మార్గాలను తాత్కాలికంగా నిలిపేశాయి. గగనతల పరిమితులు, భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి. కొన్ని విమాన సంస్థలు రీఫండ్‌ లేదా ఉచితంగా తేదీ మార్పు సౌకర్యం ఇస్తున్నాయి. అయితే అవి నిర్దిష్ట తేదీలు, మార్గాలకే వర్తించవచ్చు. కాబట్టి ఆయా సంస్థల వెబ్‌సైట్లలో వివరాలు పరిశీలించాలి. ముందస్తు ప్రయాణాలకు రీఫండబుల్‌ టికెట్లు కొనడం వల్ల కొంత స్వేచ్ఛ ఉంటుంది. ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలనుకునే వారు నిబంధనలు జాగ్రత్తగా చదవాలి. యుద్ధం, అంతర్గత అశాంతి వంటి అంశాలు సాధారణంగా కవరేజీ నుంచి మినహాయింపుగా ఉంటాయని ఇన్స్యూర్‌మైట్రిప్‌ సంస్థ సీఈఓ సుజాన్‌ మోరో తెలిపారు. “ఎయిర్‌లైన్‌ రీఫండ్‌ ఇస్తే అదనంగా క్లెయిమ్‌ చేసే అవకాశం ఉండకపోవచ్చు,” అని చెప్పారు.
సుదీర్ఘ ప్రయాణాలకు టికెట్‌ ధరల పెరుగుదల...
విమానాల రద్దులతో పాటు అనేక విమాన సంస్థలు మూసివేసిన గగనతలాన్ని తప్పించుకోవడానికి సుదీర్ఘ దూరం ప్రయాణించే మార్గాలు ఎంచుకుంటున్నాయి. దీనివల్ల ఇతర దేశాల గగనతలాన్ని వినియోగించాల్సి రావడంతో అదనపు చార్జీలు చెల్లించాలి. పైగా ఎక్కువ దూరం ప్రయాణించాలంటే అధిక ఇంధనం అవసరం. “ఈ ఖర్చులు చివరకు ప్రయాణికులపై పడతాయి,” అని ఆల్టన్‌ ఏవియేషన్‌ కన్సల్టెన్సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బ్రయాన్‌ టెర్రీ తెలిపారు. యుద్ధం కొనసాగితే కొన్ని సంస్థలు ఇంధన సర్‌చార్జీలు విధించే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కొన్ని మార్గాల్లో టికెట్‌ ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల భారీగా సర్వీసులు రద్దవడంతో డిమాండ్‌–సరఫరా ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముడి చమురు ధరలు పెరగడం కూడా భవిష్యత్తులో ప్రభావం చూపొచ్చు. అంతర్జాతీయ గగన రవాణా సంఘం గణాంకాల ప్రకారం 2024 నాటికి విమాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో దాదాపు 30 శాతం జెట్‌ ఇంధనంపైనే ఖర్చవుతోంది. వచ్చే వారం లోపల అనేక మార్గాల్లో సీట్లు పూర్తిగా నిండిపోయాయి. చివరి సీట్లకు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ముందుగానే బుక్‌ చేసే ప్రయాణాలకు ప్రస్తుతం కొంత తక్కువ ధరలు కనిపిస్తున్నా, యుద్ధం తీవ్రత పెరిగితే పరిస్థితి ఒక్కసారిగా మారొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.





















Tags:    

Similar News