గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు

భారత దేశం నుంచి 88 లక్షల మంది వలస కార్మికులు ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. . గల్ఫ్ ఉద్యోగాలు తాత్కాలికమైనవి.

Update: 2023-08-08 15:41 GMT

గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు

భారత దేశం నుంచి 88 లక్షల మంది వలస కార్మికులు ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. సాధారణంగా రెండేళ్ల కాంట్రాక్ట్ పీరియడ్ (ఒప్పంద కాలం) తో గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు ఇస్తారు. గల్ఫ్ వలసలు, ఉద్యోగాలు తాత్కాలికమైనవి. వీరు టెంపరరీ కాంట్రాక్టుచువల్ వర్కర్స్ (తాత్కాలిక ఒప్పంద కార్మికులు) గా పిలువబడుతారు. నిర్ణీత కాలానికి సంబంధించిన తాత్కాలిక కొలువుతో కూడినదే గల్ఫ్ వలసల వ్యవస్థ. యూఏఈ (36 లక్షలు), సౌదీ అరేబియా (25 లక్షలు), కువైట్ (9 లక్షలు), ఖతార్ (8 లక్షలు), ఓమాన్ (7 లక్షలు), బహరేన్ (3 లక్షలు) భారతీయులు నివసిస్తున్నట్లు ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటిచింది.

గత సంవత్సరం (2021-22) లో ప్రవాస భారతీయుల నుంచి 89 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) భారతదేశం పొందింది. అమెరికన్ డాలర్ పాత రేటు రూ.75 చొప్పున లెక్క వేస్తే... 89 బిలియన్ డాలర్లకు రూ.6 లక్షల 67 వేల 500 కోట్లు అవుతుంది. ఇది దేశ జిడిపి (స్థూల దేశీయ ఉత్పత్తి) లో 3 శాతం. ఇందులో ఆరు గల్ఫ్ దేశాలలో నివసించే 88 లక్షల మంది భారతీయ కార్మికుల చెమట చుక్కల ద్వారా సంపాదించిన సొమ్మే అధికం. ఎర్రటి ఎండలో.. తమ రక్తాన్ని మరిగించి చెమటను చిందిస్తున్న గల్ఫ్ కార్మికులు ఒక్కొక్క చెమట చుక్క ఒక్క రూపాయి లాగా సంపాదించి పంపిన విదేశీ మారక ద్రవ్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పవృక్షం, కామధేనువు లాగా లాభం చేకూరుస్తున్నది. అయితే కార్మికులు మాత్రం ఎలాంటి సంక్షేమ పథకాలకు నోచుకోకుండా వారి బతుకులు ఎండమావులు అవుతున్నాయి. భారత ప్రభుత్వం వద్ద విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగ్గుతున్నట్లు ఇటీవలి నివేదికలు తెలుపుతున్నాయి. రూపాయి విలువ అధఃపాతాళానికి జారిపోయింది. ఎలాంటి ఖర్చు లేకుండా మానవ వనరులను విదేశాలకు ఎగుమతి చేస్తున్న భారత ప్రభుత్వం ప్రవాసులు పంపే సొమ్ముతో భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నది. ప్రభుత్వాలకు ఎన్నారైల పెట్టుబడులు, వారు రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై ఉన్న ప్రేమ వారి సంక్షేమం పట్ల లేదు. ప్రవాసి కార్మికుల బతుకులు మారడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సంక్షేమ బడ్జెట్ ను కేటాయించడం లేదు. ఒంటరి వలసలు, తక్కువ చదువు, తక్కువ నైపుణ్యం, తక్కువ ఆదాయం కలిగిన కార్మికులు అన్యాయానికి గురవుతున్నారు.

తెలంగాణ రాష్ట్రం నుండి 15 లక్షల మంది వలసదారులు గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నారని ఒక అంచనా. ఒక కార్మికుడు, ఉద్యోగి సరాసరి నెలకు 700 యుఎఇ దిర్హామ్స్ / సౌదీ రియాల్స్ లేదా సమానమైన గల్ఫ్ కరెన్సీలు పంపితే అది రూ.14 వేలకు సమానం. 15 లక్షల మంది గల్ఫ్ ప్రవాసులు నెలకు రూ.14 వేలు పంపిస్తే రూ. 2,100 కోట్లు అవుతుంది. సంవత్సరానికి రూ. 25,200 కోట్లు. తెలంగాణ గల్ఫ్ ప్రవాసులు పంపే రూ. 25,200 కోట్లు విదేశీ మారక ద్రవ్యం వారి కుటుంబ సభ్యుల ద్వారా దేశీయంగా వినియోగంలోకి వచ్చినప్పుడు కనీసం 10 శాతం జీఎస్టీతో సంవత్సరానికి రూ.2,520 కోట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన సగం వాటా కింద సంవత్సరానికి రూ.1,260 కోట్లు లాభపడుతున్నది. బొగ్గుబాయి - బొంబాయి - దుబాయి... అనే నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాలు ముందున్నాయి. తెలంగాణ ఏర్పడిన గత తొమ్మిది సంవత్సరాలలో తెలంగాణకు చెందిన 1,800 కి పైగా కార్మికులు గల్ఫ్ దేశాలలో మృతి చెందారు. 2014 కంటే ముందు కూడా వేలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాలలో అమరులయ్యారు.

భారత్ నుంచి విదేశాలకు ఎగుమతులను పెంచడం, విదేశీ మారక ద్రవ్య ఆదాయాన్ని పెంచడం, భారతదేశంలో అదనపు ఉపాధిని సృష్టించడం కోసం వందశాతం ఎక్స్ పోర్ట్ ఓరియెంటెడ్ యూనిట్స్ స్కీం (ఎగుమతి ఆధారిత యూనిట్ల పథకం) 1981లో ప్రవేశపెట్టబడింది. ఇందుకోసం ప్రభుత్వం భూమి, నీరు, విద్యుత్, బ్యాంకు రుణాలు, పారిశ్రామిక రాయితీలు, పన్ను మినహాయింపులు అందిస్తుంది. కార్మికులు తమ స్వంత ఖర్చులతో గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా మానవ వనరులను విదేశాలకు ఎగుమతి చేస్తున్న భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తున్నది. గల్ఫ్ రిక్రూట్మెంట్ వ్యవస్థకు ఇండస్ట్రీ స్టేటస్ (పరిశ్రమల హోదా) ఇవ్వాలి. ఎక్స్ పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలి. మెడికల్ టెస్ట్, ఫ్లయిట్ టికెట్, నైపుణ్య శిక్షణ లాంటి వాటికి ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వాలి. గల్ఫ్ దేశాలకు కార్మికులను భర్తీ చేసేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు సర్వీస్ చార్జీగా తీసుకోవడానికి రిక్రూటింగ్ ఏజెన్సీలకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సర్వీస్ చార్జీపై 18 శాతం జీఎస్టీ రూ.5,400 వసూలు చేస్తున్నారు. రిక్రూట్మెంట్ ఫీజు లేకుండా ఉచితంగా ఉద్యోగ భర్తీ చేపట్టాలనే సంకల్పానికి ప్రభుత్వాల మద్దతు అవసరం. కార్మికులను విదేశాలకు పంపే అతిపెద్ద దేశమైన భారత్ కు ఒక మైగ్రేషన్ పాలసీ (వలస విధానం) లేకపోవడం విచారకరం.

గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధితో కూడిన 'గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు' ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇందుకోసం సమగ్ర తెలంగాణ ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) రూపొందించాలి. విదేశాలకు ఉపాధికోసం వలస వెళ్లిన కార్మికులకు సామాజిక రక్షణ (సోషల్ ప్రొటెక్షన్), సామాజిక భద్రత (సోషల్ సెక్యూరిటీ), విశ్వవ్యాప్త సామాజిక రక్షణ అంతస్తులు (యూనివర్సల్ సోషల్ ప్రొటెక్షన్ ప్లోర్స్) ఏర్పాటు చేయాలని ఆసియా-గల్ఫ్ దేశాలలో చర్చ జరుగుతున్నది. వలస కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాల పోర్టబిలిటీ (ఏ దేశానికైనా బదిలీ చేసుకునే వీలు) ఉండాలనే డిమాండ్ ఉన్నది. చెల్లించే ప్రీమియం భరించగలిగిన సరసమైన ధరలో ఉండే విధంగా జాతీయ సామాజిక రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రపంచ సామాజిక సురక్ష నిధి (గ్లోబల్ సోషల్ ప్రొటెక్షన్ ఫండ్‌) ను ఏర్పాటు చేయాలి. కోవిడ్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 49.5 కోట్ల మంది తమ ఉద్యోగాలు, ఆదాయాలను కోల్పోయారు. అసహాయులైన లక్షలాది మంది వలస కార్మికులు ఉట్టి చేతులతో విదేశాల నుంచి తమ స్వదేశాలకు చేరుకున్నారు.

మనకంటే చిన్నదేశం బంగ్లాదేశ్ లో అక్కడి కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు 'ప్రవాసి కళ్యాణ్ బ్యాంకు' ద్వారా రుణాలు ఇస్తుంది. గల్ఫ్ మృతుల కుటుంబాలకు 3 లక్షల టాకాల సహాయం. వలస కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్స్. విదేశాల నుంచి పంపే డబ్బుకు ప్రభుత్వం రెండున్నర శాతం ప్రోత్సాహకం ఇస్తుంది. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం రూ.500 కోట్ల వార్షిక బడ్జెట్ కేటాయించాలి. గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పెన్షన్ లతో కూడిన సమగ్రమైన సాంఘిక భద్రత (సోషల్ సెక్యూరిటీ) పథకం ప్రవేశ పెట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి.

-సింగిరెడ్డి నరేష్ రెడ్డి, తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు. 

(Views, thoughts, and opinions expressed in this newsstory/article belong solely to the author)


Tags:    

Similar News