హైదరాబాద్ విద్యార్థికి 2.5 కోట్ల వేతనం
హైదరాబాద్ ఐఐటీ విద్యార్థికి భారీ వేతనంతో ఉద్యోగం లభించింది.
హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకు చెందిన నాలుగో సంవత్సరం కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విద్యార్థి ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్కు సంస్థ చరిత్రలోనే అత్యధిక ప్యాకేజీ లభించింది. నెదర్లాండ్స్కు చెందిన మల్టీనేషనల్ ట్రేడింగ్ సంస్థ ఆప్టివర్ ఏడాదికి రూ.2.5 కోట్ల వేతనంతో ఉద్యోగ ఆఫర్ ఇచ్చింది.ఆప్టివర్లో రెండు నెలల ఇంటర్న్షిప్ పూర్తి చేసిన తర్వాత ఎడ్వర్డ్ను అదే సంస్థ ఇంటర్వ్యూ చేసింది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక ఈ భారీ ప్యాకేజీతో ఉద్యోగాన్ని ఖరారు చేసింది. జూలైలో డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ఆయన సాఫ్ట్వేర్ ఇంజినీర్గా కెరీర్ ప్రారంభించనున్నారు.
మరో రెండు భారీ ప్యాకేజీలు...
హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పదిహేడేళ్ల చరిత్రలో ఇప్పటివరకు ఏ విద్యార్థికీ రూ.కోటి కంటే ఎక్కువ ప్యాకేజీ రాలేదు. ఈ ఏడాది మాత్రం మరో ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.1.1 కోట్ల ప్యాకేజీలు లభించాయి. అలాగే మొదటి దశ ప్లేస్మెంట్ డ్రైవ్లో నలుగురు విద్యార్థులకు రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్లు వచ్చినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. తాజాగా లభించిన ఆఫర్ తో ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు.