ఫ్యాక్ట్ చెక్: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చనిపోయారంటూ పోస్టులు వైరల్..!

ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ లాలూ ప్రసాద్ యాదవ్ మరణించారని తప్పుడు క్యాప్షన్‌లతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఫోటోలను పోస్టు చేస్తూ ఉన్నారు.

Update: 2022-05-10 05:35 GMT

క్లెయిమ్: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ చనిపోయారంటూ పోస్టులు

ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు


బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ మరణించారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ లాలూ ప్రసాద్ యాదవ్ మరణించారని తప్పుడు క్యాప్షన్‌లతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఫోటోలను పోస్టు చేస్తూ ఉన్నారు. ఓ మరణించి ఉన్న వ్యక్తికి సంబంధించిన ఫోటోను కూడా వైరల్ చేస్తున్నారు.

ఓ వ్యక్తి శవం శవపేటికలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. बहुत दु:खद बिहार के पूर्व मुख्यमंत्री देश के रेल मंत्री रह चुके लालू प्रसाद यादव की ईलाज दिल्ली AIIMS के दौरान मृत्यु हो गई। అంటూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ అధిపతి లాలూ ప్రసాద్ యాదవ్ చనిపోయారనే వార్తల్లో ఎటువంటి నిజం లేదు. లాలూ ప్రసాద్ యాదవ్ చనిపోయారని ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు, మీడియాలో కథనాలు కూడా రాలేదు.

రాష్ట్రీయ జనతా దళ్ ప్రతినిధి చిత్రాంజన్ గగన్‌తో కొన్ని మీడియా సంస్థలు సంప్రదించగా.. ఈ వైరల్ వాదనను ఆయన ఖండించారు.

మా బృందం లాలూ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై వార్తా నివేదికల కోసం వెతకగా.. ఆర్‌జేడీ అధినేత ఆరోగ్యంగా ఉన్నారని, ఢిల్లీలోని ఆయన పెద్ద కూతురు ఇంట్లో కోలుకుంటున్నారని రాష్ట్రీయ జనతా దళ్ అధికార ప్రతినిధి చిత్రాంజన్ గగన్ పేర్కొన్నట్లు పలు వార్తా కథనాలు వచ్చాయి.

ఇండియా టుడేతో మాట్లాడిన గగన్, 'కొంతమంది సోషల్ మీడియాలో ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ ఆరోగ్యంపై పక్కా ప్రణాళికతో కూడిన కుట్రకు పాల్పడుతూ ఉన్నారు. అందులో భాగంగా తప్పుడు, నిరాధారమైన వదంతులు ప్రచారం చేస్తున్నారని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు
తేజస్వి యాదవ్
, తేజ్ ప్రతాప్ యాదవ్‌ల సోషల్ మీడియా ప్రొఫైల్‌లను కూడా పరిశీలించాం. ఆయన ఇద్దరు కుమారుల ట్విట్టర్ హ్యాండిల్స్, ఫేస్‌బుక్ పేజీలలో లాలూ ప్రసాద్ యాదవ్ మరణానికి సంబంధించిన పోస్ట్‌లు లేవు.

74 సంవత్సరాల లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో కిడ్నీ సంబంధిత సమస్యలతో ఎయిమ్స్ ఢిల్లీలో చేరారు.

ఫిబ్రవరి 2022లో బీహార్ పశుగ్రాసం కుంభకోణంతో ముడిపడి ఉన్న ఐదవ కేసుకు సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్‌కు ప్రత్యేక CBI కోర్టు శిక్ష విధించింది. "డోరండా ట్రెజరీ నుండి 139 కోట్ల రూపాయల గోల్ మాల్ కు సంబంధించి అతనికి ఐదేళ్ల జైలు శిక్ష మరియు ₹60 లక్షల జరిమానా విధించబడింది." అని హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది.

లాలూ ప్రసాద్ యాదవ్ మరణించినట్లుగా వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.


క్లెయిమ్: లాలూ ప్రసాద్ యాదవ్ మరణించినట్లుగా వస్తున్న పోస్టులు
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim :  Very sad. Former chief minister of Bihar and former railway minister Lalu Prasad Yadav passes away while being treated at AIIMS Delhi.
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News