ఫ్యాక్ట్ చెక్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు వ్యతిరేకంగా తిరువణ్ణామలైలో RSS కార్యకర్తలు గిరి ప్రదక్షిణ చేపట్టారంటూ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు వ్యతిరేకంగా తిరువణ్ణామలైలో RSS కార్యకర్తలు గిరి ప్రదక్షిణ

Update: 2025-12-24 05:50 GMT

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డిసెంబర్ 14న తిరువణ్ణామలైలో పర్యటించారు. భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి అమిత్ షా మాత్రమే కాదు, ఆర్‌ఎస్‌ఎస్ బెటాలియన్ వచ్చినా కూడా తమిళనాడు రాష్ట్రాన్ని ఎన్నికలలో ప్రభావితం చేయలేవని, కాషాయ పార్టీని ఓడించడం ద్వారా డీఎంకే విజయం సాధిస్తుందని అన్నారు. తిరువణ్ణామలైలో జరిగిన డిఎంకె యువజన విభాగం (నార్త్ జోన్) కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన స్టాలిన్, దశాబ్దాలుగా ఆ విభాగం అభివృద్ధి, దాని వెనుక ఉన్న కృషిని, ఇతర నాయకుల కృషిని గుర్తు చేసుకున్నారు.


2024లో బీజేపీ మూడవసారి కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత బీజేపీ లాంటి సంస్థలు తమిళనాడులో పాగా వేయాలని ఎంతో దూకుడుగా పనిచేస్తున్నాయని, వారు అబద్ధాలను చెప్పడం, రాష్ట్రానికి అపకీర్తిని తీసుకుని వచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. తమిళనాడు, తమిళ భాషను రక్షించడం మాత్రమే విధి కాదని, మొత్తం భారతదేశాన్ని రక్షించడం తమ విధి అని స్పష్టం చేశారు స్టాలిన్. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా సైద్ధాంతికంగా పోరాడుతున్న ఏకైక రాష్ట్ర పార్టీ డిఎంకె అని, బీజేపీ తమిళనాడులో మాత్రమే విజయం సాధించలేకపోయిందని స్టాలిన్ అన్నారు.

ఒక వీధిలో చాలా మంది కలిసి కవాతు చేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను షేర్ చేస్తున్న వారు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హిందూ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లక్షలాది మంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకర్తలు తమిళనాడులోని అరుణాచల కొండ చుట్టూ తిరిగారని ఆ పోస్టుల్లో తెలిపారు.

"హిందువులపై తమిళనాడు CM స్టాలిన్ కి చేస్తున్న కుట్రలకి నిరసనగా వాడి వెన్నులో వణుకు పుట్టేలా ఈరోజు లక్షలాది మంది RSS కరసేవకులు అరుణాచల శివ గిరి ప్రదక్షిణ చేశారు ఓం నమఃశివాయ" అంటూ పోస్టులు పెట్టారు.


వైరల్ పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.


వైరల్ పోస్టులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు



 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేశాం. RSS సంస్థ అలాంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఉంటే అది తప్పకుండా వార్తల్లో నిలిచి ఉండేది. కానీ అందుకు సంబంధించిన నివేదికలు ఏవీ మాకు లభించలేదు. ఇటీవలి కాలంలో అరుణాచలం చుట్టూ RSS కార్యకర్తలు ప్రదక్షిణ నిర్వహించారనే వాదనలో ఎలాంటి నిజం లేదు.

తమిళనాడులోని తిరువణ్ణామలైలోని అరుణాచల కొండ వద్ద ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పెద్ద సంఖ్యలో నిరసన తెలిపినట్లు తెలిపే వార్తా నివేదికలు మా కీవర్డ్ శోధనలలో కనిపించలేదు.

ఇక వైరల్ వీడియో స్క్రీన్ షాట్స్ ను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఇవే దృశ్యాలు కలిగి ఉన్న 6 నిమిషాల 38 సెకన్ల వెర్షన్ వీడియోను ఫేస్‌బుక్‌లో కనుగొన్నాము.

"#संघ शताब्दी१०० वर्ष पथ संचलन RSS100" అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు.

Full View


RSS కు సంబంధించి 100 సంవత్సరాలు పూర్తీ అయిన సందర్భంగా చేపట్టారని తెలుస్తోంది. పలువురు యూజర్లు ఇది రత్లాం, మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిందని కామెంట్స్ చేశారు.

ఇదే వీడియోను అక్టోబర్ 6, 2025న ఆర్గనైజర్ వీక్లీలో పోస్టు చేశారు. "#WATCH | A grand RSS Path Sanchalan was held in Ratlam, Madhya Pradesh. #RSS100Years #RSS100 #RSS" అంటూ వీడియోను పోస్టు చేశారు.



దీన్ని క్యూగా తీసుకుని మేము సంబంధిత కీవర్డ్స్ తో సెర్చ్ చేశాం. అక్టోబర్ 5, 2025న, రత్లాంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వేలాది మంది స్వయం సేవకులు మార్చ్ నిర్వహించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అందుకు సంబంధించిన కథనాలను ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు. 

వైరల్ అవుతున్న పోస్టుల్లోని వీడియోలు, రత్లాం, మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన RSS మార్చ్ కు సంబంధించిన విజువల్స్ ఒకటేనని స్పష్టంగా తెలుస్తోంది.


కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.


Claim :  RSS కార్యకర్తలు మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన కార్యక్రమం
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News