నకిలీ జీరోధా ఏజెంట్ల చేతిలో రూ.8.9 లక్షలు నష్టపోయిన వ్యాపారి

వేరే పేర్లతో జీరోధా ప్రతినిధులుగా నటించిన మోసగాళ్లు బ్యాంక్‌ ఖాతాల మధ్య డబ్బులు మారుస్తూ మోసం చేసినట్లు ఫిర్యాదు

Update: 2025-10-22 12:32 GMT

కొంపల్లి కి చెందిన వ్యాపారవేత్త ఎం.సాంబయ్య (52)కి నకిలీ జీరోధా ఏజెంట్లు రూ.8.95 లక్షల మోసం చేశారు. ఈ విషయం పై ఆయన సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం — కొంపల్లి లో  నివాసముంటున్న సాంబయ్య, తరచూ జీరోధా ద్వారా  స్టాక్‌ ట్రేడింగ్‌ చేసే ఆయనకు, గ్రీన్‌ స్టాక్‌ అడ్వైజర్‌ సంస్థకు చెందిన బ్రోకర్‌ వికాస్ చౌధరీ పేరుతో ఒక వ్యక్తి ఫోన్‌ చేశారు. అతను తన స్నేహితులు తరుణ్‌, వినోద్‌లను జీరోధా ప్రతినిధులుగా పరిచయం చేశాడు.

వాట్సాప్‌ ద్వారా నకిలీ ట్రేడింగ్‌ యాప్‌ లింక్‌
ఆ ముగ్గురు సాంబయ్యను “https://trade.wealthsecurity.in” అనే లింక్‌ ద్వారా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోమని సూచించారు. అది జీరోధా అధికారిక యాప్‌ అని చెప్పి, డబ్బును తమ బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయమని ఒత్తిడి చేశారు. నిజమైనదే అనుకొని సాంబయ్య మొత్తం రూ.8,95,000 తన బ్యాంక్‌ ఖాతాల ద్వారా మోసగాళ్ల ఖాతాలకు పంపించారు.

మొదట వారు విశ్వాసం పొందడానికి రూ.56,181 తిరిగి ఆయన ఖాతాకు జమ చేశారు. తరువాత యాప్‌లో రూ.20 లక్షల వర్చువల్‌ లాభం చూపించి, ఆ లాభాన్ని విడుదల చేసేందుకు మరింత డబ్బు అడిగారు. సాంబయ్య, ఆయన కుమారుడు యాప్‌ నిజానిజాలు పరిశీలించగా అది నకిలీ అని తేలింది.

ఫిర్యాదు తర్వాత దర్యాప్తు మొదలు
తన బ్యాంక్‌ సలహా మేరకు సాంబయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రేడ్‌ వెల్త్‌సెక్యూరిటీ యాప్‌, దానికి సంబంధించిన వెబ్‌సైట్‌ (trade.wealthsecurity.in)ను బ్లాక్‌ చేయాలని అభ్యర్థించారు.

జనా స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, కోట్లక్‌ మహీంద్రా, ఆర్బీఎల్‌, ఫినో బ్యాంక్‌ వంటి పలు ఖాతాలను పోలీసులు గుర్తించారు. వాటి లావాదేవీలపై విచారణ మొదలైంది. మోసగాళ్ల వాట్సాప్‌ నంబర్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

సైబర్‌ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తూ — అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్లు మాత్రమే ఉపయోగించాలని సూచించారు.

సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్: 1930



Tags:    

Similar News