Online Trading scam: ఆన్లైన్ ట్రేడింగ్ మోసంలో వ్యాపారికి రూ.4.8 కోట్లు నష్టం
లావణ్య, అర్పితల ప్రలోభాలకు బలై పెట్టుబడులు మూడు రెట్లు లాభమంటూ ఎటోరో గ్లోఎఫ్ఎక్స్ వెబ్సైట్తో మోసం
హైదరాబాద్: సైబర్ మోసగాళ్ల వలలో చిక్కిన సంగారెడ్డి జిల్లా వ్యాపారవేత్త రూ.4.89 కోట్లు నష్టపోయాడు. మూడు రెట్లు లాభం వస్తుందని నమ్మించి నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ ద్వారా ఈ మోసం జరిగిందని తెలంగాణ సైబర్క్రైమ్ స్పెషల్ బ్రాంచ్ (టీజీసీఎస్బీ) కేసు నమోదు చేసింది.
ముత్తంగి గ్రామానికి చెందిన 41 ఏళ్ల ఆరవింద్కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబర్ 7న లావణ్య దాసరి, ఆమె స్నేహితురాలు అర్పిత అనే ఇద్దరు మహిళలు బెంగళూరులో పనిచేస్తున్నామని చెప్పి వాట్సాప్ ద్వారా ఆరవింద్కి పరిచయం అయ్యారు. లావణ్య తన మామ నరసింహరావు యూకేలో ఉంటారని, తండ్రి విశాఖపట్నంలో టైరు వ్యాపారం చేస్తున్నారని చెప్పింది.
తర్వాత ఎటోరోగ్లోఎఫ్ఎక్స్.కామ్ (www.etoroglofx.com) అనే ట్రేడింగ్ వెబ్సైట్ గురించి వివరించి, భారత్, అమెరికా మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి మూడు రెట్లు లాభాలు వస్తాయని నమ్మించారు. మొదట రూ.50 వేల్ని యూపీఐ ద్వారా రుల్దు సింగ్ అనే వ్యక్తికి పంపారు. కొద్ది సేపటిలో 15% లాభం చూపించడంతో నమ్మకం పెరిగింది.
తరువాత నమ్మకం కలిగించేందుకు ‘గోల్డెన్ లెగ్’ అనే సంస్థ పేరుతో రూ.15,400 ఆయన ఖాతాకు జమ చేశారు. ఆ తర్వాత నిరంతర ఒత్తిడి, ఆకర్షణీయమైన వాగ్దానాలతో రెండు నెలల్లోపు ఆయన కొటక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాల నుంచి బిహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని పలు ఖాతాలకు మొత్తం రూ.4,89,34,600 బదిలీ చేశారు. ఆ మొత్తాన్ని జయప్రకాశ్ ఎంటర్ప్రైజెస్, జాహిద్ ఎంటర్ప్రైజెస్, నివేశా ఎల్ఎల్పీ, రిధి సిద్ధి ఎంటర్ప్రైజెస్, అలోక్ ట్రేడర్స్, ఎక్విరా ఎంటర్ప్రైజెస్, ఓమెంద్ర కాంట్రాక్టర్, బాలాజీ ఎంటర్ప్రైజెస్, సమ్నాని అగ్రో ఫుడ్స్, మలయ్ ఎంటర్ప్రైజెస్, మొహిత్ ట్రేడర్స్, స్లోర్డ్స్ కన్స్యూమర్ గూడ్స్ ఇండియా సంస్థలకు పంపించారు.
తరువాత ఆన్లైన్ ప్లాట్ఫామ్లో రూ.16 కోట్లు లాభం చూపించారు. అక్టోబర్ 28న ఆరవింద్ డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నించగా, 15% కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రూ.2.5 కోట్లు చెల్లించాలంటూ మోసగాళ్లు షరతు పెట్టారు. దీనిపై అనుమానం వచ్చిన ఆయన సైబర్క్రైమ్ పోర్టల్లో నవంబర్ 1న ఫిర్యాదు చేశారు.
ఆరవింద్ తెలిపిన మేరకు రూ.4.89 కోట్ల ఆర్థిక నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా టీజీసీఎస్బీ అధికారులు ఐటీ చట్టం 66(D) సెక్షన్ కింద, భరతీయ న్యాయ సన్హిత 318(4), 319(2), 338 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.